అయోధ్య ఎఫెక్ట్: పేరు మారనున్న ప్రముఖ నగరం: కుశుడి పేరుతో..!
లక్నో: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం రామ్ లల్లా విరాజ్ మాన్ కు అనుకూలంగా తీర్పును వెలువరించిన తరువాత.. ఉత్తర్ ప్రదేశ్ లో ఓ ప్రముఖ నగరం పేరు మారబోతోంది. సుల్తాన్ పూర్ నగరం పేరు మార్చేయాలని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శ్రీరామచంద్రుడి కుమారుల్లో ఒకరైన కుశుడి పేరును పెట్టాలని సూత్రప్రాయంగా అంగీకరించింది. కుశ్ పూర్ లేదా కుశ్ భావన్ పూర్ అని పేరు పెట్టే అవకాశం ఉంది.
అయోధ్యలో రాములోరికి పూజల్లేవ్..పునస్కారాల్లేవ్: 26 ఏళ్లుగా దీపారాధన ఒక్కటే!
అయోధ్యపై హిందూ సమాజానికి అనుకూలంగా తీర్పు వెలువడిన తరువాత..ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న అనేక పరిణామాల్లో భాగంగా ఈ పేరు తెర మీదికి వచ్చిందని అంటున్నారు. ఏడాది కిందటే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సుల్తాన్ పూర్ పేరు మార్పుపై ఓ ప్రకటన చేశారు. అప్పటి నుంచీ అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా అయోధ్యపై తీర్పు వెలువడటం, రామజన్మభూమి స్థలంలో రామమందిరం నిర్మాణానికి సన్నద్ధమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి పాత ప్రతిపాదన బయటికి వచ్చింది.
రాజ్ పుతానా శౌర్య ఫౌండేషన్ ప్రతినిధులు ఈ విషయంపై ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యను కలిశారు. సుల్తాన్ పూర్ పేరును మార్చేయాలని కుశ్ భావన్ పూర్ గా నామకరణం చేయాలని కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. 1903 నుంచి 1982 వరకు కూడా సుల్తాన్ పూర్ నగరం పేరు కుశుడి పేరు మీదే కొనసాగిందని, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు సుల్తాన్ల పేరు పెట్టాయని అన్నారు. గోమతీ నది ఒడ్డున ఉన్న నేటి సుల్తాన్ పూర్ ప్రాంతాన్ని కుశుడు పరిపాలించాడనటానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
అక్కడి సీతాకుండ్ ఘాట్ ఒడ్డున కుశుడి నిలువెత్తు కంచు విగ్రహాన్ని నెలకొల్పిన విషయాన్ని వారు గుర్తు చేశారు. ఆయా పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని సుల్తాన్ పూర్ పేరును మార్చేయాలని, కుశుడి పేరు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కేశవ్ ప్రసాద్ మౌర్య సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం పేరు మార్చడంపై ఆసక్తిగా ఉన్నారని, సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.