ఆవు చేలో మేస్తే..దూడ గట్టున మేస్తుందా: జయప్రదను అబ్దుల్లా ఇంతమాటనేశాడేంటి..?
ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న చందంగా ఉంది ఈ తండ్రీ కొడుకుల వ్యవహారం. సినీనటి మాజీ ఎంపీ జయప్రద పేరును అప్రతిష్టపాలు చేసేందుకు ఇప్పటికే రాంపూర్ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అజాంఖాన్ కంకనం కట్టుకున్నట్లున్నారు. తానేమీ తక్కువ కాదన్నట్లుగా తండ్రి అజాంఖాన్ లైన్ను ఫాలో అవుతున్నాడు పుత్రరత్నం అబ్దుల్లా.
తండ్రి అజాంఖాన్ను ఫాలో అవుతున్న పుత్రరత్నం
కొద్ది రోజుల క్రితం సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అజాంఖాన్ సినీ నటి మాజీ ఎంపీ జయప్రదను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అజాంఖాన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెనుదుమారమే రేపాయి. తాజాగా ఆయన కొడుకు అబ్దుల్లా కూడా ఇదే లైన్ తీసుకుని జయప్రదపై సెక్సిస్ట్ కామెంట్స్ చేశాడు. జయప్రద అనార్కలి అంటూ వ్యాఖ్యానించి వివాదంలో కూరుకుపోయాడు. తను ఓ సమావేశంలో ప్రసంగిస్తూ "అలీ కావాలి భజరంగ్ భలి కావాలీ కానీ అనార్కలీ మాత్రం వద్దు " అంటూ వ్యాఖ్యలు చేశాడు.
ఎవరు ఈ అనార్కలీ..? జయప్రదను ఆమెతో ఎందుకు పోల్చాడు..?
నాటి మొఘల్ చక్రవర్తి అక్బర్ సంస్థానంలో అనార్కలీ ఓ చెలికత్తెగా ఉండేది. అక్బర్ కుమారుడు జెహంగీర్తో ఆమె అక్రమ సంబంధం నెరిపినట్లు చరిత్ర చెబుతోంది. ఇది నచ్చని అక్బర్ ఆమెను బంధించి శిక్షిస్తాడు. ఈ అనార్కలీతో జయప్రదను పోల్చుతూ అబ్దుల్లా తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ చేసిన అలీ భజ్రంగ్ భలీ వ్యాఖ్యలపై స్పందిస్తూ తమకు అలీ కావాలీ భజ్రంగ్భలీ కావాలని చెబుతూ రాంపూర్ నుంచి పోటీచేసే అనార్కలీ మాత్రం వద్దంటూ కామెంట్ చేశాడు అబ్దుల్ అజాం ఖాన్. అంతేకాదు బీజేపీ అధికారంలోకి వస్తే దేశచరిత్రలో మరో మచ్చగా మిగిలిపోతుందని అబ్దుల్లా చెప్పాడు.
అబ్దుల్లాకు జయప్రద కౌంటర్
అబ్దుల్లా చేసిన కామెంట్స్పై జయప్రద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తండ్రి అజాం ఖాన్ అంటే పెద్దగా చదువు కోలేదని... విద్యావంతుడైన కొడుకు అబ్దుల్లా కూడా ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడమంటే తండ్రికి ఏమాత్రం తీసిపోని కొడుకుగా నిలిచాడని జయప్రద అన్నారు. ఆ కుటుంబం మొత్తానికి మహిళలను గౌరవించడం తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అజాం ఖాన్ వ్యాఖ్యలపై మండిపడ్డ జయప్రద ఆయన్ను ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హుడిగా ప్రకటించాలని గతంలోనే డిమాండ్ చేసింది.
ఒకప్పుడు మిత్రులుగా ఉన్న ఇద్దరూ నేడు శత్రవులుగా పోటీచేస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి రాంపూర్ నియోజకవర్గంపై పడింది. ఏప్రిల్ 23న జరిగే మూడో దశ ఎన్నికల్లో రాంపూర్ నియోజకవర్గం కూడా ఓటింగ్లో పాల్గొంటోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో అక్కడి ప్రజలు ఎవరికి మద్దతు తెలుపుతారో తెలియాలంటే మే 23 వరకు వేచి చూడాల్సిందే.