జల్లికట్టుకు ఏమాత్రం తీసిపోకుండా.. కన్నడిగుల 'కంబళ' పోరు..
కర్ణాటకలో ఎంతగానో ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ కళ కంబళ. సాధారణంగా నవంబర్ మాసంలో మొదలయ్యే ఈ క్రీడ మార్చి వరకు కొనసాగుతుంది.
హుబ్లీ: ఒక్క జల్లికట్టు ఉద్యమం అటు ఆంధ్రప్రదేశ్ను ఇటు కర్ణాటకను రగిలించింది. పట్టిన పట్టు విడవకుండా తమ సంస్కృతిలో భాగమైన జల్లికట్టుపై నిషేధం ఎత్తివేయించుకునేందుకు తమిళులు ఎంతగా ఆరాటపడ్డారో.. పోరాడారో.. ఇప్పుడదే స్థాయిలో ఏపీ, కర్ణాటక ప్రజలు కూడా తమ ఆకాంక్షల కోసం ఉద్యమించేందుకు సిద్దమవుతున్న పరిస్థితి.
జల్లికట్టు ఉద్యమం ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని రగిలిస్తే.. కర్ణాటకలో 'కంబళ' ఉద్యమాన్ని రగలించింది. తమ ప్రాచీన కళ అయిన కంబళ( బఫెలో రేస్-దున్నపోతుల పోటీ)పై నిఫేధం ఎత్తివేయాలంటూ కన్నడిగులంతా పోరుకు సిద్దమయ్యారు. పెద్దలు, విద్యార్థులు రోడ్డెక్కి కంబళకు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.
కంబళ మద్దతు కోసం శుక్రవారం నాడు హుబ్లీలో వేలాది మంది విద్యార్థులు రోడ్ల పైకి వచ్చి ఆందోళన చేశారు. కంబళపై నిషేధం ఎత్తివేయాల్సిందిగా డిమాండ్ చేశారు. పెటాను నిషేధించాలని కోరుతూ ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు.
కాగా, కంబళను నిలిపివేయాలంటూ జంతు హక్కుల సంస్థ పెటా కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేయడంతో గతేడాది నవంబర్ లో 'కంబళ' కు బ్రేక్ వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై 2016, నవంబర్ లో చివరిసారిగా విచారణ జరగ్గా.. తదుపరి విచారణ ఈ నెల 30న జరగనుంది.
ఇదిలా ఉంటే, కంబళ కోసం ప్రజల నుంచి పెల్లుబికుతున్న మద్దుతుతో అటు ప్రభుత్వం సైతం కంబళపై సానుకూలంగా స్పందిస్తోంది. దీనిపై అవసరమూతే ఆర్డినెన్స్ తీసుకువస్తామని సీఎం సిద్దరామయ్య ఇదివరకే ప్రకటించారు.
ఈ లెక్కన తమిళుల్లాగే.. కన్నడిగులు కూడా తమ సాంప్రదాయ కళను కాపాడుకునేందుకు.. కేంద్రం మెడలు వంచేదాకా పోరాటం చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
జానపద క్రీడ కంబళ గురించి:
కర్ణాటకలో ఎంతగానో ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ కళ కంబళ. సాధారణంగా నవంబర్ మాసంలో మొదలయ్యే ఈ క్రీడ మార్చి వరకు కొనసాగుతుంది. కంబళ ఉద్యమం ఊపందుకుంటున్న తరుణంలో.. దానిపై నిషేధానికి వ్యతిరేకంగా మూద్ బిద్రిలోని స్వరాజ్ మైదాన్ లో ఈ నెల 28న ఆదివారం 50వేల మందితో నిరసన ప్రదర్శన చేపట్టునున్నట్టు తెలుస్తోంది.
దాదాపు 250జతల పోట్ల గిత్తలతో ఈ ఆందోళన నిర్వహించడానికి కంబళ నిర్వహణ కమిటీ ఏర్పాట్లు కూడా చేస్తోంది. మొత్తానికి జల్లికట్టు ఉద్యమానికి ఏమాత్రం తీసిపోకుండా.. తమ ఆందోళనలు ఉధృతం చేయడం ద్వారా కంబళ ఆకాంక్షను నెరవేర్చుకోవాలన్న యోచనలో కన్నడిగులు ఉన్నారు.