రైతులకు రుణమాఫీ: కనీస ఆదాయ స్కీం తర్వాత రాహుల్ గాంధీ మరో హామీ
పాట్నా: సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రజలను మచ్చిక చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త పథకాలతో ముందుకు వస్తోంది. ఇప్పటికే పేదవారికి కనీస ఆదాయ స్కీంను ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ తాజాగా, ఆదివారం బీహార్లో మరో ప్రకటన చేశారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. రాహుల్ గాంధీ పాట్నాలో నిర్వహించిన జన ఆకాంక్ష సభలో మాట్లాడారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో రుణమాఫీ హామీ పని చేసిందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ ఛత్తీస్గఢ్ మినహా మిగతా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాలేదు. బీఎస్పీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లలో వరుసగా బీజేపీ ప్రభుత్వమే మూడుసార్లు ఉండటం కారణంగా కాంగ్రెస్ గెలిచిందనేది చాలామంది అభిప్రాయం. అయితే రుణమాఫీ ఈ రాష్ట్రాల్లో ఉపయోగపడిందని కాంగ్రెస్ భావిస్తోందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో రాహుల్ పాట్నా సభలో తాము అధికారంలోకి వస్తే రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. బీహార్ అభివృద్ధిలో వెనుకబడి పోవడానికి సీఎం నితీష్ కుమార్, ప్రధాని మోడీనే కారణమని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ దారుణంగా మారిపోయిందని, నిరుద్యోగుల సమస్య పెరిగిపోతోందన్నారు.
రానున్న ఎన్నికల్లో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్నా సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతూ రైతులకు మాత్రం రోజుకి కేవలం రూ.17 చెల్లిస్తోందన్నారు. పాట్నాలో జరిగిన ఈ సభలో రాహుల్తో పాటు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, శరద్ యాదవ్ తదితరులు ఉన్నారు.
రాహుల్ గాంధీ ఫ్లెక్సీలు చించివేత
రాహుల్ గాంధీని శ్రీరాముడితో పోల్చుతూ పాట్నాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని దుండగులు చింపివేశారు. రాహుల్ గాంధీ నడయాడుతున్న రాముడి అవతారమని పేర్కొంటూ ఇటీవల పాట్నాలో ఈ పోస్టర్లు వెలిశాయి. రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ సహా పలువురు కాంగ్రెస్ నేతల ఫోటోలు ఉన్నాయి. వాళ్లు కేవలం రామనామ జపం చేస్తారని, కానీ మీరు మాత్రం రాముడిలా ఉండండి అంటూ ఈ పోస్టర్లలో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
రాహుల్ గాంధీని దేవుడితో పోల్చి హిందువుల మనోభావాలు దెబ్బతీశారని రాహుల్, బీహార్ కాంగ్రెస్ చీఫ్ మదన్ మోహన్ ఝా సహా మరో నలుగురు నేతలపై పాట్నా సివిల్ కోర్టులో ఫిర్యాదు దాఖలైంది. అధికార జేడీయూ-బీజేపీ నేతలు సైతం పోస్టర్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.