ఘోరం: ఆకలిని తట్టుకోలేక పురుగుల మందు తాగిన చిన్నారులు
భోపాల్: మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో దారుణం జరిగింది. ఆకలికి తట్టుకోలేక చిన్నారులు పురుగుల మందు తాగారు. ఇది డిసెంబర్ 31వ తేదీన జరిగింది. ఈ విషయం తెలిసిన నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (ఎన్సీపీసీఆర్) విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
వారం క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో కొందరు గిరిజనులకు రేషన్ దుకాణాల నుంచి సరకులు అందలేదు. దీంతో ఆయా కుటుంబాలు ఆకలితోనే ఉంటున్నాయి.
ఈ క్రమంలో ఆ కుటుంబాలలోని చిన్నారులు ఆకలికి తట్టుకోలేక పురుగుల మందు తాగారు. వెంటనే చిన్నారులను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. అయితే ఈ సమాచారాన్ని బయటకు రానీయలేదు.
స్థానిక మీడియా ద్వారా విషయం వెలుగు చూసింది. చిన్నారుల వయసు తెలియాల్సి ఉంది. దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఎన్సీపీసీఆర్ అధికారులను ఆదేశించింది.