ఎన్ఆర్సీ: మమత అంతర్యుద్ధం వ్యాఖ్యలపై అసోం కాంగ్రెస్ చీఫ్ ఆగ్రహం
ఢిల్లీ: అసోంలో జాతీయ పౌరుల రిజిస్టర్ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ - ఎన్ఆర్సీ) అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ అసోం అధ్యక్షులు మండిపడ్డారు. ఎన్ఆర్సీ ముసాయిదాలో దాదాపు 40 లక్షల మంది పేర్లు నమోదు కాకపోవడంపై మమతా మాట్లాడుతూ.. అంతర్యుద్ధం తలెత్తే పరిస్థితిని కల్పిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలను తమ పార్టీ ఖండిస్తుందని కాంగ్రెస్ పార్టీ అసోం అధ్యక్షులు రిపూన్ బోరా కూడా అన్నారు. ముఖ్యమంత్రి లాంటి బాధ్యతాయుత పదవిలో ఉన్న మమతా బెనర్జీ అంతర్యుద్ధం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఆమె వ్యాఖ్యలు అసోంలో ప్రభావం చూపవన్నారు. రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు ఉన్నాయన్నారు.
మమతా వ్యాఖ్యలపై స్పందించిన కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ఆమె వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుందని, ఆమె అంతర్యుద్ధం అంటూ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు.
మమత ఏమన్నారంటే...
అసోం పౌరుల జాబితాలో 40 లక్షల మంది పేర్లు లేకపోవడంపై మండిపడ్డారు. మంగళవారం ఢిల్లీలో క్రైస్తవుల సదస్సులో మమత మాట్లాడుతూ వాళ్లు అసోంలో ఎలా నివసిస్తారని, వాళ్లకు ఆహారం, ఇండ్లు, స్కూళ్లు ఎలాగని, ఇలాంటి చర్యలు అంతర్యుద్ధం, రక్తపాతానికి దారితీస్తాయన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్నార్సీ) తయారు చేశారన్నారు. ఇలాంటివి జరుగకుండా అడ్డుకుంటామన్నారు.