చంద్రబాబుకు మమత, మాయావతి దూరం: సంప్రదింపులు లేవ్, పలకరింపులు అసలే లేవ్
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పడానికి తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తోన్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నట్టే కనిపిస్తున్నాయి. భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఢీ కొట్టడానికి కాంగ్రెస్ సహా బీజేపీయేతర రాజకీయ పార్టీలు ఒకేతాటిపైకి వస్తున్నప్పటికీ.. కీలక నేతగా చంద్రబాబును ప్రోత్సహించడానికి ఎంతమాత్రమూ ఆసక్తి చూపట్లేదు. దేశ రాజధాని న్యూఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ధర్మ పోరాట దీక్ష సాక్షిగా ఈ వ్యవహారం బట్టబయలైంది.
ధర్మ పోరాట దీక్ష పేరుతో నల్ల చొక్కా ధరించి, పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. కాంగ్రెస్ సహా బీజేపీయేతర అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు దీనికి హాజరయ్యారు. ఒక్క బహుజన్ సమాజ్ వాది పార్టీ తప్ప. చంద్రబాబు నిర్వహించిన ధర్మపోరాట దక్షకు బీఎస్పీ నుంచి ఒక్క ప్రతినిధి కూడా రాలేదు. చంద్రబాబుకు నైతిక మద్దుతు తెలియజేయలేదు.
సాధారణంగా.. జాతీయ స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకులెవరైనా నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలు చేపడితే.. తోటి రాజకీయ నాయకులు హాజరు కావడం అత్యంత సహజం. చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు బీఎస్పీ తరఫున ఒక్కరు కూడా హాజరు కాలేదు. చంద్రబాబుతో ఫోన్ లో కూడా సంప్రదించినట్లు సమాచారం లేదు.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా దాదాపు ఇదే ధోరణిని అనుసరించారు. ధర్మపోరాట దీక్షా శిబిరానికి మమతా బెనర్జీ రాలేదు. పార్టీ ఎంపీని మాత్రం పంపించి, చేతులు దులుపుకొన్నారు. ఫోన్ లో అయినా ఆమె చంద్రబాబును పలకరించలేదు. నిజానికి- మమతా బెనర్జీ ఈ దీక్షా శిబిరానికి హాజరు అవుతారనే అందరూ భావించారు. దీనికి కారణాలు లేకపోలేదు.
యునైటెడ్ ఇండియా పేరుతో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతలో కిందటి నెల 19వ తేదీన మమతా బెనర్జీ నిర్వహించిన ప్రతిపక్షాల ర్యాలీలో చంద్రబాబు పాల్గొన్నారు. దీనికోసం ఆయన ఒక రాత్రి ముందే కోల్ కతకు చేరుకున్నారు. కోల్ కతలో బస చేశారు. మరుసటి రోజు మధ్యాహ్నం కోల్ కతలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ర్యాలీలో చంద్రబాబు పాల్గొన్నారు. సుమారు 15 నిమిషాల పాటు ప్రసంగించారు కూడా.
అంతేకాదు- శారదా, రోజ్ వ్యాలీ ఛిట్ ఫండ్ల కుంభకోణం వ్యవహారంలోనూ చంద్రబాబు..దీదీకి నైతిక మద్దతు ఇచ్చారు. ఈ రెండు కుంభకోణాల దర్యాప్తులో భాగంగా కోల్ కత నగర పోలీస్ కమిషనర్ ను విచారించడానికి వచ్చిన సీబీఐ అధికారుల బృందాన్ని మమతా బెనర్జీ అడ్డుకున్న విషయం తెలిసిందే. సీబీఐ విచారణను నిరసిస్తూ ఆమె మూడురోజుల పాటు చేపట్టిన సేవ్ డెమోక్రసీ ఆందోళనలో చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. ఆమెకు నిమ్మరసం ఇచ్చి మరీ దీక్ష విరమింపజేశారు.
కేంద్రానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ చేపట్టిన ప్రతి ఆందోళనకూ చంద్రబాబు మద్దతు ఇచ్చినప్పటికీ.. తన దాకా వచ్చే సరికి పరిస్థితి తలకిందులైంది. చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్ష వైపు మమతా బెనర్జీ కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం ఫోన్ ద్వారా కూడా సంప్రదించనూ లేదు. తన తరఫున ఓ ఎంపీని పంపి, ఊరుకున్నారు. చంద్రబాబు పట్ల మమతా దీదీ.. ఎందుకు అంటీముట్టనట్టు ఉన్నారనే విషయం జాతీయ స్థాయిలో చర్చకు కారణమైంది.
మరోవంక- బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా దక్షా శిబిరానికి గైర్హాజరు కావడం, కనీసం పార్టీ తరఫున ఏ ఛోటా, మోటా నాయకుడిని కూడా పంపించకపోవడం అనేక అనుమానాలకు తావిచ్చింది. చంద్రబాబు కాంగ్రెస్ దగ్గర కావడం ఈ రెండు పార్టీలకూ ఇష్టం లేకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. మమతా బెనర్జీకి గానీ, మాయావతికి గానీ, సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ కు గానీ కాంగ్రెస్ అంటే అస్సలు పడదు. అలాంటి కాంగ్రెస్ తో చంద్రబాబు రాసుకు, పూసుకు తిరగడం నచ్చకపోవడం వల్లే మమతా, మాయావతి డుమ్మా కొట్టారని అంటున్నారు.
ఇదే విషయంపై చంద్రబాబును ప్రశ్నించగా.. ఆయన నీళ్లు నమిలారు. పొడిపొడిగా బదులిచ్చారు. సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. తమ మధ్య కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని, అందువల్లే మాయావతి రాలేకపోయారని చంద్రబాబు చెబుతున్నారు. జాతీయ విషయాలపై తాము ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నామని అన్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా తాము కలుస్తామని అంటున్నారు.
చంద్రబాబు ఎప్పుడు యూటర్న్ తీసుకుంటారో అనే సందేహం వారిద్దరిలోనూ వ్యక్తమౌతున్నట్లు సమాచారం. చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో నరేంద్రమోడీని కీర్తించడం, ఆనక యూ టర్న్ తీసుకోవడం, కాంగ్రెస్ ను భుజాన వేసుకుని మోస్తుడటం నచ్చకే మాయావతి గానీ, మమతా బెనర్జీ గానీ చంద్రబాబును దూరం పెడుతున్నారని సమాచారం.