భారత్ అనుకూలం, ఆర్థికస్థితిని కూడా: మోడిపై ప్రణబ్
హోచిమిన్హ్ సిటీ: వియత్నాం పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అనుకూలంగా వ్యాఖ్యలరు చేశారు. ఉప ఎన్నికలు బీజేపీకి షాక్ ఇచ్చాయి. అయితే, ప్రణబ్ మోడీ ప్రభుత్వం పైన ప్రశంసలు కురిపించారు. కొత్త ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా భారత్ అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందని చెప్పారు.
భారత్ ఆర్థిక వ్యవస్థను మెరుగైన స్థితిలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందని, ఇది ఇంకా మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదేళ్ల కాలానికి అవసరమైన పూర్తిస్థాయి విధాన రూపకల్పనకు కావాల్సినంద సమయం లేకపోయినప్పటికీ, కొత్త ప్రభుత్వం బడ్జెట్లో పలు కీలక విధానాలు పొందుపరిచిందన్నారు.
వియత్నంలోని హోమిచిన్హ్ సిటీలో భారతీయులు ఏర్పాటు చేసిన విందులో ఆయన మాట్లాడారు. జపాన్లో మోడీ పర్యటన ఫలితంగా భవిష్యత్తులో జపాన్ నుండి భారత్కు పెద్ద మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారత్లో ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబాట్ పర్యటన సందర్భంగా ఆయనతో మంచి ఫలితాలు వచ్చేలా చర్చలు జరిపామన్నారు.
త్వరలో అమెరికా అధ్యక్షుడు ఒబామాతో మోడీ చర్చలు జరపనున్నారన్నారు. వియత్నం, భారత దేశం కూడా సహకరించుకుంటూ ముందుకు సాగాలని ప్రణబ్ అన్నారు. ప్రణబ్ ముఖర్జీ పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పైన కూడా ప్రశంసలు కురిపించారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు.