ఆ కస్టమర్ కేర్ వెబ్ లింక్ పై క్లిక్ చేసింది.. ఖాతా నుంచి రూ 95వేలు మటాష్..!
బెంగళూరు: ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కొత్తగా ప్రారంభించిన పిక్ అండ్ డ్రాప్ సర్వీసు "'స్విగ్గీ గో" ఆదిలోనే చిక్కుల్లో పడింది. యుద్ధప్రాతిపదికన సెప్టెంబరు 4న ఈ సర్వీసును ప్రారంభించింది. స్విగ్గీ గో పేరుతో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ నుంచి వచ్చిన ఓ లింకుపై క్లిక్ చేసిన మహిళ, ఆమె బ్యాంక్ వివరాలు, యూపీఐ పిన్ వివరాలు ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆమె ఖాతానుంచి రూ.95 వేలు మాయమయ్యాయి. ఇది గ్రహించిన మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఫోన్ డెలివరీ చేసేందుకు ' స్విగ్గీ గో ' యాప్ను ఆశ్రయించిన మహిళ
అపర్ణా టక్కర్ సూరీ అనే మహిళ బెంగళూరులోని ఇంద్రానగర్లో నివాసముంటోంది. తన స్మార్ట్ఫోన్ను అమ్మాలన్న ఉద్దేశంతో ఓఎల్ఎక్స్లో పెట్టింది. ఫోను కొందామని భావించిన మొహ్మద్ బిలాల్ అనే వ్యక్తి ఆమెను సంప్రదించాడు. దీంతో స్విగ్గీ గో యాప్ ద్వారా తన ఫోనును మొహ్మద్ బిలాల్కు పంపింది. ఫోను అందిన తర్వాత బిలాల్ ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపుతానని చెప్పాడు. ఇక ఉదయం 8:45 గంటలకు డెలివరీ బాయ్ వచ్చి అపర్ణ దగ్గర ఫోనును తీసుకున్నాడు. ఉదయం 11 గంటలకు బిలాల్ అపర్ణకు ఫోన్ చేసి డెలివరీ ఆర్డర్ క్యాన్సిల్ అయ్యిందని, తన చేతికి ఫోన్ ఇంకా అందలేదన్న సమాచారం చేరవేశాడు. డెలివరీ బాయ్కు ఫోన్ చేయగా ఆర్డర్ క్యాన్సిల్ అయ్యిందని ఫోను ఆఫీసులోనే ఉందని అపర్ణకు చెప్పాడు.
కృష్ణమ్మకు జల కళ.. భారీగా వరద ఉధృతి.. దిగువకు నీటి విడుదల
తప్పుడు నెంబర్కు డయల్ చేసిన అపర్ణ
ఇక స్విగ్గీ గో కస్టమర్ కేర్కు ఫోన్ చేద్దామని తప్పుడు నెంబర్ డయల్ చేసింది. దీంతో అవతల వ్యక్తి ఫోన్ ఎత్తి ఆమె సమస్యగురించి తెలుసకున్నాడు. వెంటనే ఓ లింకు పంపుతామని చెప్పి దానిపై క్లిక్ చేసి మూడు రూపాయలు ఆన్లైన్లో చెల్లించాల్సిందిగా కోరాడు. ఇది నమ్మిన అపర్ణ లింక్పై క్లిక్ చేసింది వెంటనే ఆమె బ్యాంకు వివరాలు, యూపీఐ పిన్ నెంబర్లు ఐదు రకాల ఫోన్ నెంబర్లకు పంపాలని తెలిపాడు. వెంటనే అపర్ణ తన వివరాలన్నీ ఐదు ఫోన్ నెంబర్లకు పంపింది. అంతే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఆమె ఖాతా ఉన్న బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చింది. రూ.95వేలు బదిలీ అయినట్లు రావడంతో ఒక్కసారిగా షాక్కు గురైంది అపర్ణ. వెంటనే బయ్యప్పనహళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఆన్లైన్ ఫ్రాడ్స్ పై జాగ్రత్తగా ఉండాలని స్విగ్గీ సూచన
అపర్ణను ఎవరో మోసం చేశారని.. స్విగ్గీకి ఆమె ఫోన్ చేయలేదని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇదొక ఆన్లైన్ మోసమని... ప్రముఖ బ్రాండ్ కంపెనీల పేర్లతో తప్పుడు లింకులు సృష్టించి డబ్బులు హైటెక్ పద్దతిలో కొందరు ఆన్లైన్ మోసగాళ్లు కొట్టేస్తున్నారని స్విగ్గీ ప్రతినిధి తెలిపారు. అంతేకాదు స్విగ్గీ సంస్థ తమ వినియోగదారులను ఎవరినీ వ్యక్తిగత బ్యాంకు వివరాలు అడగదని, స్విగ్గీతో కనెక్ట్ కావాలంటే యాప్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ కనెక్ట్ కావాలని ప్రతినిధి సూచించారు.