3 రోజులైనా జీశాట్-6ఏ శాటిలైట్ ఆచూకీ లేదు, గుండెపోటులాంటిదే
న్యూఢిల్లీ: మూడు రోజులు దాటుతున్నా జీశాట్ -6 ఏ ఉపగ్రహంతో సంబంధాలు ఇంకా పునరుద్దరించలేకపోయారు ఇస్రో శాస్త్రవేత్తలు.ఆదివారం నాడు ఈ ఉపగ్రహం ఇస్రోతో సంబంధాలు తెగిపోయాయి. అయితే ఈ సంబంధాలను పునరుద్దరిస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. కానీ, ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేకపోయారు.
రూ.270 కోట్లను ఖర్చు చేసి ప్రయోగించిన శాటిలైట్ చివరకు గుండెపోటు వచ్చినట్టుగా ఉందని ఇస్రో అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. మార్చి 30వ తేది ఉదయం 9.22 నిమిషాలకు ఇస్రోకు చివరిసారిగా సమాచారం వచ్చింది. ఆ తర్వాత ఈ ఉపగ్రహం గురించి ఇస్రోకు ఎలాంటి సంబంధాలు లేకుండాపోయాయి. ఇస్రోతో సంబంధాలు తెగిపోయి ఇప్పటివరకు మూడు రోజులు అవుతోంది.
గతంలో ఉపగ్రహలు ప్రయోగించే సమయంలో సాంకేతిక సమస్యల గురించి కొన్ని సూచనలు వచ్చేవని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. కానీ, ఈసారి మాత్రం ఆ తరహ ఎలాంటి సూచనలు లేవని వారు చెబుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఇస్రోతో శాటిలైట్ సంబంధాలను కోల్పోవడంపై శాస్త్రవేత్తలు కారణాలను విశ్లేషిస్తున్నారు.
ఉపగ్రహంలో ఎలాంటి సమస్యలు లేవని ఇస్రో శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. మొదటిసారి కక్ష్య పెంపు ప్రక్రియ చేపట్టిన సమయంలో ఆ సమయంలో శాటిలైట్ నుండి సమాచారం చేరవేసిందని శాస్త్రవేత్తలు గుర్తు చేశారు.
అయితే రెండోసారి కక్ష్య పెంపును మార్చి 31వన చేపట్టినట్టు తెలిపింది. అయితే ఉపగ్రహంతో అనుసంధానం కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇస్రో అధికారులు చెబుతున్నారు.భారతదేశం అభివృద్ది చేసిన రాకెట్లలో రెండో అతి పెద్దదిగా పేరుగాంచిన జీశాట్-6ఏ ఉపగ్రహం నిర్ణీత కక్ష్యలో చేరడానికి 17 నిమిషాల సమయం పట్టింది.