తాజ్మహల్కు భారీగా మరమత్తులు...అప్పటి అందాలు ఇక కనిపించవా..?
ఆగ్రా: తాజ్మహల్ అద్భుతమైన కట్టడం. ప్రేమకు చిహ్నంగా అప్పటి మొఘల్ చక్రవర్తి షాజహాన్ దక్షిణ యమునా తీరంలో ఈ కట్టడాన్ని నిర్మించారు. 1632లో ప్రారంభించి 1648లో నిర్మాణం పూర్తి చేశారు. ఉత్తర్ ప్రదేశ్లోని ఆగ్రాలో నిర్మితమైన ఈ సుందరమైన కట్టడం కొన్ని శతాబ్దాలుగా చెక్కుచెదరలేదు. అయితే కాలక్రమంలో ఈ పాలరాతి కట్టడం కాలుష్యం బారిన పడి అందాన్ని కోల్పోతూ వస్తోంది. ఇందుకు కారణం ఆగ్రా నగరం పరిసరాల్లో పరిశ్రమలు రావడం వాటి నుంచి వచ్చే కాలుష్యంతో తాజ్మహల్ అందం చెదరిపోతోంది. ఇక గత కొన్ని శతాబ్దాలుగా ఉన్న ఈ కట్టడంలో తొలిసారిగా స్వల్ప మరమత్తులు చోటుచేసుకోనున్నాయి.
తాజ్మహల్ చుట్టూ స్వల్ప మరమత్తులు జరగనున్నాయి. అందులోని కొన్ని రాళ్లను తొలగించి వాటి స్థానంలో కొత్త రాళ్లను అధికారులు పెట్టనున్నారు. ఇక తాజ్మహల్ దగ్గర నవంబర్ 4వ తేదీ నాటికి కాలుష్యం 349గా ఉంది. అదే ఆగ్రా నగరంలో 441గా సూచిస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరం అని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజ్మహల్ చుట్టూ కాలుష్యం గతంలోకంటే చాలావరకు నియంత్రించగలిగారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారసత్వ సంపదను కాపాడుకోవాలనే బలమైన కోరికతో పలు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో తాజ్మహల్ దగ్గర కాలుష్యం ఒక్కింత తగ్గుముఖం పట్టింది.
ఇక ఏటా కొన్ని లక్షల మంది పర్యాటకులు తాజ్మహల్ను సందర్శిస్తారు. దీంతో క్రమంగా తాజ్మహల్ గోడలు, ఫ్లోరింగ్ ధ్వంసం అవుతూ వస్తున్నాయి.దీంతో రంగంలోకి దిగిన ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తాజ్మహల్కు నష్టం జరుగుతుందని భావించి తాజ్మహల్ చుట్టూ బారికేడ్లను పెట్టారు. దీంతో పర్యాటకులు గోడలను తాకే అవకాశం లేదు. అయితే ఇక ఫ్లోరింగ్ మాత్రం చాలా ధ్వంసమైంది. ఈ క్రమంలోనే ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 400 రాళ్లను తొలగించి కొత్త రాళ్లను అక్కడ రీప్లేస్ చేస్తోంది. రెడ్ శాండ్ స్టోన్ మార్బుల్ స్టోన్లను అక్కడ పెడుతున్నారు. ఈ రాళ్లు ఒక చదరపు అడుగు నుంచి 9 చదరపు అడుగుల వరకు ఉన్నాయి. వీటి ఖర్చు రూ.22 లక్షలు అని ఏఎస్ఐ అధికారి ఒకరు తెలిపారు. రాజస్థాన్లోని బన్షిపహాడ్పూర్ నుంచి ఈ రాళ్లను తీసుకొస్తున్నట్లు ఆ అధికారి వెల్లడించారు.
1648లో పూర్తయిన తాజ్మహల్ అప్పటి నుంచి ఇప్పటి దాకా పెద్దగా ప్రాధాన్యత ఉన్న మరమత్తులు జరగలేదు. ఇక ఈ రాళ్ల మార్పిడి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉన్న సమయంలోనే జరగడం విశేషం. అయితే ఈ పనులతో పర్యాటకులపై ఏమైనా ఆంక్షలు విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ అదే జరిగితే పర్యాటక రంగం, పర్యాటకులను నమ్ముకుని కాలం వెల్లదీస్తున్న చిరువ్యాపారులకు నష్టం తప్పదని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు చెబుతున్నారు.