మమత ఇలాఖాలో కమలాధిపతి... రెండు బహిరంగ సభల్లో పాల్గొననున్న అమిత్ షా
కోల్కతా: లోక్సభ ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగా... బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఈ రోజు పశ్చిమ బెంగాల్ నుంచి తన ప్రచారాన్ని మొదలు పెట్టనున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విపక్షాల ఐక్యతా ర్యాలీ నిర్వహించన తరువాత అమిత్ షా ర్యాలీలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల పాటు బెంగాల్లో అమిత్ షా పర్యటించనున్నారు.
బెంగాల్లో రెండు రోజుల పాటు అమిత్ షా పర్యటన
"పశ్చిమ బెంగాల్లో రెండు రోజుల పాటు నేను పర్యటిస్తున్నాను. ముందుగా అంటే 22 జనవరిన మాల్డాలో బహిరంగ సభలో ప్రసంగించి ఆ తర్వాత జనవరి 23న ఝార్గ్రామ్లో మరో సభలో పాల్గొంటాను. మమతా ప్రభుత్వాన్ని నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు మోడీ నాయకత్వంలో బీజేపీ పనిచేస్తోంది" అని అమిత్ షా ట్వీట్ చేశారు. మెగా ర్యాలీ ముగిసిన కొన్ని గంటల్లోనే పశ్చిమ బెంగాల్లోని మొత్తం 42 పార్లమెంటు స్థానాల్లో బీజేపీ భారీ సభలను పెట్టనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ సభలకు ముఖ్యనేతలు అంటే ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, యోగీ ఆదిత్యనాథ్లాంటి వారు పాల్గొంటారని వెల్లడించింది. వీటన్నిటినీ ఫిబ్రవరి 8లోగా నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇక ఫిబ్రవరి 9 నుంచి మార్చి 13 వరకు రాష్ట్రంలోని విద్యార్థులకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో లౌడ్ స్పీకర్లపై నిషేధం కొనసాగుతుంది.
సుప్రీం కోర్టులో బీజేపీకి రథయాత్రపై చుక్కెదురు
ముందుగా బీజేపీ రథ యాత్ర నిర్వహించాలని ప్లాన్ చేయగా ఇందుకు మమత సర్కార్ అనుమతి ఇవ్వలేదు. రథయాత్ర జరిపితే శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించడంతో దీనిపై బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో తిరిగి బహిరంగ సభలకే మొగ్గు చూపింది. 2019 ఎన్నికలు బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యంగా బెంగాల్లో కనీసం 22 సీట్లు గెలవాలని కమలనాథులు భావిస్తున్నారు. ప్రస్తుతం బెంగాల్లో బీజేపీ రెండు స్థానాలను మాత్రమే దక్కించుకుంది.
మాల్డాలో అమిత్ షా హెలికాఫ్టర్ దిగేందుకు అనుమతి నిరాకరణ
ఇక అమిత్ షా మాల్డాలో దిగేందుకు అతని హెలికాఫ్టర్కు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే జిల్లా అధికారులు మాత్రం బీజేపీకి వివరణ ఇచ్చారు. హోటల్ గోల్డెన్ పార్క్ ఎదురుగా అమిత్ షా చాపర్ ల్యాండ్ కావాల్సి ఉండగా అక్కడ మరమత్తులు జరుగుతుండటం, రన్వేపై చెత్త చెదారం పడటంతో చాపర్ ల్యాండింగ్ సాధ్యంకాదని వెల్లడించారు.అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇదే రన్వేను ఎలా వినియోగిస్తుందని బీజేపీ ప్రశ్నించింది. ఉద్దేశపూర్వకంగానే అమిత్ షా హెలికాఫ్టర్ ల్యాండింగ్కు మమత సర్కార్ అనుమతి ఇవ్వలేదని మండి పడ్డారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.అయితే తాము ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న సంగతి తెలుసని... మాల్డాలోని హెలిప్యాడ్లో అమిత్ షా చాపర్ ల్యాండ్ అయ్యేందుకు అనుమతులు ఇచ్చామని గుర్తు చేసింది మమతా ప్రభుత్వం.