‘మా కోడలే దెయ్యమై ఇంటిని కాల్చి బూడిద చేసింది.. చంపేస్తానంటోంది’
లక్నో: దెయ్యాలు ప్రతీకారం తీర్చుకుంటాయని మనం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ, ఇక్కడ నిజంగానే తమపై ఓ దెయ్యం ప్రతీకారం తీర్చుకుంటోందని ఓ కుటుంబం తీవ్ర భయాందోళనకు గురవుతోంది. ఇటీవల తమ ఇంటిని కూడా పూర్తిగా మంటల్లో కాల్చిబూడిద చేసిందని చెబుతున్నారు. ఆ దెయ్యం కూడా ఎవరో కాదు, తమ చనిపోయిన కోడలేనని చెప్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్లో గాజులు తయారు చేసే కుటుంబానికి చెందిన ఇల్లు హఠాత్తుగా తగలబడిపోయింది. ఇంట్లోని వస్తులన్నీ అగ్నికి ఆహుతైపోయాయి. దుస్తులు, డబ్బులు, గాజుల తయారీకి ఉపయోగించే వస్తువులు ఏవీ మిగల్లేదు. సర్వం కాలి బూడిదయ్యాయి. దీంతో ఆ కుటుంబం, గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో పడిపోయారు.
పదిహేనేళ్ల క్రితం అనుమానాస్పదంగా చనిపోయిన ఆ ఇంటి కోడలు పింకియే దెయ్యమై కుటుంబాన్ని నాశనం చేసిందని గ్రామంలో వదంతులు షికార్లు చేశాయి. మరోవైపు పింకీ తనకు కలలో చాలాసార్లు కనిపించిందని, చంపేస్తాననీ, సర్వనాశనం చేస్తానని చాలాసార్లు బెదిరించిందని పింకీ అత్తగారు బెదిరిపోయింది.
పింకి మరణం తర్వాత ఆమె భర్త నాగేంద్ర రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను కూడా దెయ్యం పట్టి పీడిస్తోందని, నాగేంద్ర కొడుకును కూడా బలితీసుకుందని చెబుతున్నారు. అప్పుడే నాగేంద్ర తండ్రి మంత్రగాళ్లను సంప్రదించారని, దీంతో ఆగ్రహం చెందిన పింకీ దెయ్యం ఆ కుటుంబంపై పగ తీర్చుకుందనే భయాందోళనకు గురవుతున్నారు.
దెయ్యం భయంతో ఆ కుటుంబం ఆహారం తీసుకునేందుకు కూడా భయపడుతోంది. కాగా, ఈ వార్తలను హేతువాద సంఘాలు కొట్టి పారేస్తున్నాయి. మండు వేసవిలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు అక్కడక్కడ సంభవిస్తాయని.. వదంతులు నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.