ఈవీఎం ట్యాంపరింగ్తో గెలిచిన బీజేపీకి శుభాకాంక్షలు: హార్దిక్ పటేల్ సంచలనం
అహ్మదాబాద్: ఈవీఎం ట్యాంపరింగ్తో గుజరాత్ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీకి శుభాకాంక్షలు అంటూ పటీదార్ ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ ఎద్దేవా చేశారు. ఆయన బీజేపీకి అభినందనలు తెలియజేస్తూనే సెటైర్ వేశారు. ఫలితాల అనంతరం ఆయన మాట్లాడారు.
తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని తేల్చి చెప్పారు. ఫలితాలతో సంబంధం లేకుండా తమ పటీదార్ ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల బీజేపీ గెలుపొందిందని మరోసారి ఆరోపణలు గుప్పించారు.
బీజేపీకి శుభాకాంక్షలు
గుజరాత్ ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉందని హార్దిక్ పటేల్ అన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్పై విపక్షాలు ఏకతాటి పైకి వచ్చి పోరాడాలని సూచించారు. ఈవీఎం ట్యాంపరింగ్ పెద్ద సమస్య అన్నారు. ట్యాంపరింగ్తో గెలిచిన బీజేపీకి తాను శుభాకాంక్షలు చెబుతున్నానని వ్యాఖ్యానించారు.
ఎక్కడెక్కడ ట్యాంపరింగ్ చేశారంటే
బీజేపీ ట్యాంపరింగ్ చేసిందని ఆరోపించిన హార్దిక్ పటేల్ ఎక్కడెక్కడ చేసిందో కూడా చెప్పారు. సూరత్, రాజ్కోట్, అహ్మదాబాదులలో ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయని సంచలన ఆరోపణలు చేశారు. తాను ఏ పార్టీకి చెందిన వాడిని కాదని హార్దిక్ చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈవీఎంలు వాడటం లేదని, మన దేశంలో అవసరమా అన్నారు.
సుజనా చౌదరి శుభాకాంక్షలు
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన నేపథ్యంలో టిడిపి నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు, ప్రధాని నరేంద్ర మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.
ఇద్దరు యువనేతల గెలుపు
కాగా, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ముగ్గురు యువనేతలు ప్రత్యేకంగా నిలిచారు. పాటిదార్ ఆందోళన్ నేత హార్దిక్ పటేల్, ఓబీసీ నేత అల్పేశ్, దళిత హక్కుల కార్యకర్త జిగ్నేశ్ ఎన్నికలకు ముందు ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. వీరిలో అల్పేశ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హార్దిక్ ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పి కాంగ్రెస్కు మద్దతిచ్చారు. జిగ్నేశ్ మాత్రం ఏ పార్టీలో చేరకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. జిగ్నేష్, అల్పేష్లు గెలిచారు.