నిర్భయకు న్యాయం చేకూర్చిన డాక్టర్ దిశ: ఎన్కౌంటర్.. మూడున్నర నెలల్లో గ్యాంగ్ రేప్ దోషుల ఉరికంబం..
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతం, ఎన్కౌంటర్ ఘటన.. నిర్భయ కేసును ప్రభావితం చేసిందా? దిశ నిందితుల ఎన్కౌంటర్ తరువాతే.. ఢిల్లీ గ్యాంగ్రేప్ కేసులో వేగవంతమైందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. డాక్టర్ దిశ కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసిన మూడు నెలల వ్యవధిలోనే నిర్భయ కేసు దోషులు ఉరికంబాన్ని ఎక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నిర్భయ.. దిశ.. రెండు కేసుల మధ్య
నిర్భయ, దిశ ఉదంతాల మధ్య భావసారూప్యం ఉంది. ఈ రెండూ ఒకేలాంటి విషాదకర సంఘటనలు. కాకపోతే ఒక్కటే తేడా- నిర్భయ కేసులో బాధితురాలి కుటుంబానికి న్యాయం దక్కడానికి ఏడు సంవత్సరాల, మూడు నెలల సమయం పట్టింది. దిశ ఘటనలో సత్వర న్యాయం చోటు చేసుకుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అత్యాచారానికి గురైన తరువాత నిర్భయ కొన్ని రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదలగా.. వెటర్నరీ డాక్టర్ దిశను కామాంధులు సంఘటనాస్థలంలోనే హతమార్చారు.
మూడున్నర నెలల్లో
హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద నలుగురు కామాంధుల చేతుల్లో అత్యంత పాశవికంగా అత్యాచారానికి, హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ దిశ కేసులో నిందితులను సైబరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేసిన విషయాన్ని ఇప్పట్లో ఎవరూ విస్మరించలేరు. దిశపై అత్యాచారం, హత్యకు పాల్పడిన మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును సైబరాబాద్ పోలీసులు గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటర్ తరువాత మూడున్నర నెలల వ్యవధిలో నిర్భయ దోషులు ముఖేష్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మ, పవన గుప్తా, అక్షయ్ కుమార్ సింగ్.. ఉరికంబానికి వేలాడారు.
ఎన్కౌంటర్ తరువాతే.. స్పీడప్..
ఈ ఎన్కౌంటర్ పట్ల దేశం ఏ విధంగా స్పందించిందో చూశాం. సైబరాబాద్ పోలీసులను దేశ ప్రజలు ఆకాశానికి ఎత్తేశారు. నిజమైన హీరోలుగా కీర్తించారు. బాధితురాలి కుటుంబానికి సత్వర న్యాయం అందించారని ప్రశంసల వర్షాన్ని కురిపించారు. అదే సమయంలో నిర్భయ ఉదంతం కూడా ప్రస్తావనకు వచ్చింది. నిర్భయ తల్లి ఆశాదేవి.. ఆవేదన దేశవ్యాప్తంగా ప్రజలకు అర్థమైందీ అప్పుడే. వెటర్నరీ డాక్టర్ దిశపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఎన్కౌంటర్ చేయడాన్ని ఆశాదేవి సమర్థించారు. తన కుటుంబానికి జరిగిన అన్యాయం.. దిశ కుటుంబానికి జరగలేదని చెప్పుకొచ్చారు.
Recommended Video
నిర్భయ ఉదంతాన్ని గుర్తు చేసిన దిశ..
దిశ అత్యాచారం.. హత్య.. ఆపై ఎన్కౌంటర్.. ఇలా వరుసగా చోటు చేసుకున్న సంఘటనలు మరోసారి నిర్భయ ఉదంతాన్ని దేశానికి గుర్తు చేసినట్టయింది. ఏడేళ్ల తరువాత కూడా నిర్భయకు న్యాయం దక్కలేదనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చినట్టయింది. దీనితో అందరి దృష్టి కూడా నిర్భయ ఉదంతంపై నిలిచింది. ఆశాదేవి ఈ ఏడేళ్ల పాటు కొనసాగిస్తోన్న న్యాయపోరాటం అందర్నీ కదిలించింది. దిశ నిందితులకు ఎన్కౌంటర్ చేసిన మూడున్నర నెలల వ్యవధిలోనే నిర్భయ దోషులు ఉరికంబం ఎక్కేలా చేయడానికి కారణమైంది.