29 ఏళ్ళ తర్వాత కొడుకుతో స్కూల్కు, ఎక్కడంటే?
చంఢీఘడ్: 44 ఏళ్ళ వయస్సున్న గృహిణి తన కొడుకుతో కలిసి పదో తరగతి చదువుతోంది. తల్లి, కొడుకులు కలిసి ఒకే స్కూల్లో టెన్త్ చదువుతున్నారు. ఈ వయస్సులో చదువు ఎందుకని ఇరుగుపొరుగు అవహేళన చేసినా కానీ, ఆమె మాత్రం తన చదువును మాత్రం ఆపలేదు. భర్తతో పాటు, కుటుంబసభ్యులు కూడ ఆమె చదువుకు సహకరిస్తున్నారు.అంతేకాదు కొడుకుతో కలిసి ఇటీవలే ఆమె పదోతరగతి పరీక్షలు కూడ రాసింది.
పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాకు చెందిన 44 ఏళ్ళ రజనీబాలకు చాలా క్రితమే వివాహమైంది. ఆమె ముగ్గురు పిల్లల తల్లి. అయితే పిల్లలను చదవిస్తూనే ఆమె కూడ స్కూల్లో పదో తరగతి చదువుతోంది.
పదో తరగతి పూర్తి చేయాలని ఆమె భర్త పదే పదే కోరాడు. అయితే భర్త ప్రోత్సాహంతో ఆమె ఎట్టకేలకు తన కొడుకుతో కలిసి పదో తరగతిని చదువుతోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె అటెండర్గా పనిచేస్తోంది. అయితే కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై ఉంటే బాగుంటుందని ఆమెకు భర్త చెప్పాడు. పిల్లలు కూడ ఇదే విషయాన్ని చెప్పడంతో ఆమె చదువుకొంటుంది.
29 ఏళ్ళ తర్వాత తిరిగి పుస్తకాలను చేతపట్టుకొంది. కొడుకుతో కలిసి ఆమె స్కూల్కు వెళ్తోంది. ఉదయాన్నే పిల్లలతో పాటు ఆమె లేచి చదువుకొంటుంది. భర్త, అత్తతో పాటు పిల్లలు కూడ తాను చదువుకొనేందుకు సహకరిస్తారని రజనీబాల చెప్పారు.
రజనీబాల భర్త రాజ్కుమార్ సతి కూడ 17 ఏళ్ళ విరామం తర్వాత డిగ్రీ పూర్తి చేశాడు. అంతేకాదు తన భార్య రజనీబాలను కూడ డిగ్రీ పూర్తి చేయిస్తానని ఆయన ధీమాగా ఉన్నాడు.