ప్రశాంత కాశ్మీర్ కావాలా?: అఫ్రిదీకి చెంప చెల్లుమనేలా జావేద్ అక్తర్ కౌంటర్
ముంబై: జమ్మూకాశ్మీర్పై పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికే భారత క్రికెటర్ గౌతమ్ గంభీర్ గట్టి కౌంటర్ ఇవ్వగా.. తాజాగా ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతమైన జమ్మూకాశ్మీర్ చూడాలనుకుంటే పాకిస్థాన్ నుంచి భారత్లోకి చొరబడే ఉగ్రవాదులను నియంత్రించేలా చర్యలు చేపట్టాలని హితవు పలికారు.
ట్విట్టర్ వేదికగా జావేద్ అక్తర్ ఘాటుగా స్పందించారు. 'డియర్ అఫ్రిది.. జమ్మూకాశ్మీర్లో ఎటువంటి ఆందోళనలు లేకుండా.. ప్రశాంతంగా చూడాలనుకుంటున్నరా..? అయితే.. పాక్ ఉగ్రవాదులు భారత్లోకి చొరబడకుండా చూడండి. ఉగ్రవాద శిక్షిణా శిబిరాలను మూసివేసేలా చూసి.. వేర్పాటువాదులకు పాక్ ఆర్మీ మద్దతు ఇవ్వకుండా ఆపండి. అప్పుడు ఈ సమస్యకు ఓ పరిష్కారం దొరికేందుకు ఓ పెద్ద సహాయం చేసినట్లవుతుంది' అని అక్తర్ తన ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేశారు.
కాశ్మీర్లో పరిస్థితి దారుణంగా ఉందని, అణచివేత పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం తమ పోరాడుతోన్న అమాయక ప్రజలు అన్యాయంగా తుపాకీ తూటాలకు బలైపోతున్నారని, భారత్పై ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకోవాలని షాహిద్ అఫ్రిది ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
దీనికి ఇటీవల గౌతమ్ గంభీర్ కూడా ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. అఫ్రిది వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అసవరం లేదని.. నోబాల్కు వికెట్ తీసి అతడు సంబరాలు చేసుకుంటున్నాడంటూ చురకలు అంటించారు. 'అఫ్రిది నిఘంటువులో యూఎన్(ఐరాస) అంటే అండర్-19క్రికెట్' అంటూ గంభీర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.