వీడియో వైరల్: ఉత్సవాల్లో అలసిపోయిన గజరాజులు ఏం చేస్తున్నాయో చూడండి..!
కొడగు: కర్నాటకలోని మైసూరులో దసరా ఉత్సవాలు చాలా గ్రాండ్గా జరుగుతాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఉత్సవాల్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచేది మాత్రం గజరాజులే. చాలామంది భక్తులు ఈ గజరాజును చూసేందుకు మైసూరు ఉత్సవాలకు హాజరవుతారు. వీటికి మావటివారు ఎంతో శిక్షణ ఇస్తారు. అనంతరం ఉత్సవాల్లో పాల్గొనేలా చేస్తారు. ఉత్సవాల్లో అన్ని సరిగ్గా చేసేలా శిక్షణ తీసుకున్న గజరాజులు ఉత్సవాల సమయానికి వాటికి ఇచ్చిన ట్రైనింగ్ సరిగ్గా అమలు చేశాయి. ఎక్కడా తప్పు పొర్లకుండా ఉత్సవాలు జరిగే వరకు మావటివాడు చెప్పినట్లుగా నడుచుకున్నాయి. ఉత్సవాల్లో పాల్గొని చాలా అలసిపోయినట్లు కనిపించాయి.
ఇక ఉత్సవాలు ముగించాక వాటి స్వస్థలమైన కొడగు జిల్లాలోని దుబేర్ ఎలిఫెంట్ క్యాంప్కు తరలించారు. అక్కడే అవి పర్యాటకులను ఆకట్టుకున్నాయి. ఫుట్బాల్ ఆడుతూ సేదతీరాయి. చక్కగా ఫుట్బాల్ను కొడుతూ అటూ ఇటూ పరుగులు తీస్తూ పర్యాటకులను అట్రాక్ట్ చేశాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టేస్తోంది. సాధారణంగా ఇక్కడ ఉన్న ఓ గ్రౌండ్లో ఏనుగులతో పాటు ఇతర జంతువులకు కూడా గేమ్స్ ఆడటంలో శిక్షణ ఇస్తారు. దుబేర్ ఎలిఫెంట్ క్యాంపుకు తరలించిన తర్వాత ఏనుగులకు ఫుట్బాల్ ఆడటంలో శిక్షణ ఇచ్చారు.
దుబేర్ ఎలిఫేంట్ క్యాంపును అటవీశాఖ మరియు జంగిల్ లాడ్జెస్ అండ్ రిసార్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో పలు జంతువులకు శిక్షణ ఇస్తారు. ట్రైయినర్ ఏనుగు మీద కూర్చుని ఈ గజరాజులకు ఫుట్బాల్ ఆడటంలో శిక్షణ ఇస్తున్నట్లుగా వీడియోలో ఉంది. మరొక ట్రైనర్ ఆ గజరాజులకు సూచనలు ఇస్తున్నట్లుగా ఉంది. ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ అవడంతో నెటిజెన్లు ఈ బుజ్జి ఏనుగుల మీద ప్రేమను తమ మాటల్లో వర్ణిస్తున్నారు. కమాన్ ఇండియా లెట్స్ ఫుట్బాల్ అని ఒకరు కామెంట్ రాయగా మరొకరు కళ్లకు నిజమైన పండగ కనిపిస్తోందంటూ రాసుకొచ్చారు. బెంగళూరు ఫుట్బాల్కు చెందిన మరొకరు ఆ గజరాజులతో ఒప్పందం కుదుర్చుకోవచ్చా అంటూ కామెంట్ రాశారు.
#WATCH Karnataka: Elephants who took part in the parade during #Dasara festival in Mysuru, were seen playing football yesterday, after they were shifted to Dubare Elephant Camp* in Kodagu district. pic.twitter.com/yHonc8q3Sz
— ANI (@ANI) October 22, 2019
దుబేర్ అనే ఈ ప్రాంతం గజరాజులకు ఆవాసంగా ఉంటోంది. ఇది కావేరీ నదీ తీరంలో ఉన్న అటవీప్రాంతం. కొడగు జిల్లాలో ఈ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కర్నాటక అటవీశాఖ పరిధి కిందకు వచ్చే ఏనుగులకు ఇది చాలా ముఖ్యమైన ప్రాంతం.దుబేర్లో ఉన్న పలు క్యాంపుల్లో మొత్తం 150 ఏనుగులు ఉన్నట్లు సమాచారం.