మొన్న జలవిలయం, నేడు భూకంపం -ఉత్తరాఖండ్లో వరుస విపత్తులు -జనం బెంబేలు, 4.0 తీవ్రత
వందలాది ప్రాణాలను బలిగొన్న జలప్రళయం విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మరో ప్రకృతి విపత్తు తలెత్తింది. ఉత్తరాఖండ్లోని పిథోర్గఢ్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది. శుక్రవారం మధ్యాహ్నం 4.38 గంటలకు భూకంపం సంభవించినట్టు అధికారులు తెలిపారు. అయితే..
తాజా భూకంపం కారణంగా ఎక్కడైనా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందీ లేనిదీ ఇంకా వివరాలు అందలేదు. రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో ఈనెల 7న మంచుఖండం విరిగిపడి వరదలు ముంచెత్తడంతో తలెత్తిన పరిస్థితి నుంచి కోలుకోకుండానే తాజా భూకంపం సంభవించడంతో జనం బెంబేలెత్తారు.
ఉత్తరాఖండ్లో జల ప్రళయం సృష్టించిన బీభత్సంలో గల్లంతైనవారి ఆచుకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం వరకు 62 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 28 శరీర అవయవాలను వెలికితీసిన సహాయ సిబ్బంది.. వారిని గుర్తించే పనిలో ఉన్నారు. బురదతో నిండిన వరదలో 200మందికిపైగా కొట్టుకుపోగా, ఇప్పటికి 90 మంది ఆనవాళ్లు మాత్రమే లభించాయి. విపత్తు సంభవించి రెండు వారాలు కావస్తుండటంతో తమ కుటుంబ సభ్యులు తిరిగొస్తారనే ఆశలను వదులుకుంటున్నాయి కార్మికుల కుటుంబాలు. మితగావారు బతికుండే అవకాశం లేదని అధికారులు సైతం భావిస్తున్నారు.
ఈనెల 7వ తేదీన ధౌలిగంగ ఉప్పొంగి తపోవన్ విద్యుత్కేంద్రం కొట్టుకుపోయింది. ఈ వరదల్లో మొత్తం 204 మంది గల్లంతయ్యారు. కాగా, విద్యుత్కేంద్రంలోని సొరంగంలో చిక్కుకున్నవారి కోసం 13 రోజులుగా సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. సొరంగంలోని నీటిని మోటార్లతో తోడేస్తున్నారు. పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్నారు. సహాయక చర్యలను చమోలీ జిల్లా మెజిస్ట్రేట్ స్వాతి బదోరియా పరిశీలిస్తున్నారు.