దళితులపై మరో దాడి : నోట్లో మూత్రం పోసి.. అత్యంత దారుణంగా
పట్నా : గుజరాత్ లో దళితులపై దాడిని మరిచిపోకముందే.. బీహార్ లో దళితులపై మరో అమానవీయ దాడి జరిగింది. బైక్ దొంగతనం ఆరోపణలు చేస్తూ.. బాధితులను తీవ్రంగా కొట్టిన నిందితులు, అనంతరం వారి నోటిలో మూత్ర విసర్జన చేసి తమ పైశాచికత్వాన్ని బయటపెట్టుకున్నారు.
బీహార్ లోని ముజఫర్ పూర్ జిల్లా పరిధిలో ఉన్న బబుతోల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుడి తల్లి సునీతాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటన వివరాలను మీడియాకు వివరించారు. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామంలో 'అన్నపూర్ణ మహాయజ్ఞ' వేడుకలు జరుగుతుండడంతో రాజీవ్ కుమార్ పాశ్వాన్, మున్నా పాశ్వాన్ అనే ఇద్దరు దళిత యువకులు ఆ వేడుకలు చూడడానికి వెళ్లారు.
కాగా.. అక్కడి గ్రామ పంచాయితీకి ఓ మహిళ ప్రతినిధిగా వ్యవహరిస్తుండగా, ఆమె భర్త తన పలుకుబడిని ఉపయోగించుకుని దాడికి తెగబడ్డాడు. యువకులు బైక్ దొంగతనం చేశారని ఆరోపిస్తూ ఓ గదిలో బంధించిన ముఖేష్ అతని అనుచరులతో కలిసి యువకులిద్దరినీ దారుణంగా కొట్టాడు. అనంతరం ముఖేష్ ఆదేశాల మేరకు అతని అనుచరుడు ఒకరు యువకుల నోటిలో మూత్ర విసర్జన చేశాడు.
అనంతరం విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరు యువకులను విడిపించారు. దీనిపై నిందితుల్లో ఒకరైన రాజీవ్ కుమార్ పాశ్వాన్ తల్లి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేశారు. మరోవైపు ఘటనపై మీడియాతో మాట్లాడిన నిందితుడు ముఖేష్ మాత్రం దాడి ఘటనను ఖండించడం గమనార్హం.
దీనిపై అక్కడి రాజకీయ పార్టీలు కూడా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతుండగా.. స్థానిక సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ వివేక్ కుమార్ మాట్లాడుతూ.. ఘటననపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ చేయించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.