ఎన్డీయేకు రాంరాంపై అకాలీదళ్ అంతర్మధనం- వెంటాడుతున్న టీడీపీ అనుభవాలు...
మూడు వ్యవసాయ బిల్లులపై స్వరాష్ట్రం పంజాబ్లో రైతుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో వారికి మద్దతుగా కేంద్ర ప్రభుత్వం నుంచి తమ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ను తప్పించిన అకాలీదళ్ .. ఇప్పుడు ఎన్డీయేలో కొనసాగాలా వద్దా అనే మీమాంసలో పడింది. కేంద్రం నుంచి తప్పుకున్నంత సులువుగా ఎన్డీయే నుంచి తప్పుకుంటే ప్రస్తుత పరిస్ధితుల్లో ఎలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయం అకాలీలలను పట్టి పీడిస్తోంది. 2018లో సరిగ్గా ఇలాంటి పరిస్ధితే ఎదుర్కొన్న టీడీపీ అప్పట్లో ఎన్డీయేకు గుడ్చై చెప్పడమే కాకుండా బీజేపీపై ధర్మపోరాటం కూడా చేసింది. దీంతో ఒకప్పటి టీడీపీ అనుభవాలు అకాలీలను వేధిస్తున్నట్లు తెలుస్తోంది.
వ్యవసాయ బిల్లుల మంట...
కార్పోరేట్ వ్యవసాయం పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మూడు బిల్లులు ఎన్డీయేలో అనవసర చిచ్చు రగిలించాయి. సొంతబలాన్ని చూసుకుని ఇప్పటికే టీడీపీ, శివసేన వంటి మిత్రపక్షాలను దూరం చేసుకున్న బీజేపీ.. తాజాగా పాశ్వాన్కు చెందిన లోక్జన్శక్తిని కూడా దూరం చేసుకునేలా కనిపిస్తోంది. అదే సమయంలో వ్యవసాయ బిల్లులను ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలన్న ప్రయత్నం ఆ పార్టీకి సుదీర్ఘంగా మిత్రపక్షంగా ఉంటున్న శిరోమణి అకాలీదళ్కూ ఆగ్రహం తెప్పించింది. ముఖ్యంగా సొంత రాష్ట్రం పంజాబ్లో రైతుల ఆగ్రహం చవిచూస్తున్న అకాలీలకు తమ మంత్రి హర్సిమ్రత్ కౌర్తో రాజీనామా చేయించక తప్పలేదు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి కూడా ఆమోదించడంతో ఇక ఎన్డీయే నుంచి అకాలీలు తప్పుకుంటారన్న ప్రచారం సాగుతోంది.
అకాలీల అంత్మరథనం...
కేంద్ర ప్రభుత్వం నుంచి తప్పుకున్నంత సులువుగా ఎన్డీయే నుంచి అకాలీదళ్ తప్పుకునే పరిస్ధితులు కనిపించడం లేదు. దీర్ఘకాలంగా బీజేపీ, ఎన్డీయే మిత్రపక్షంగా ఉంటూ వస్తున్న అకాలీదళ్ వీరిని అంత సులువుగా వదులుకోవడం కష్టమే. మరోవైపు ఎన్డీయేకు దూరమైనా చిరకాల శత్రువు కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏలో చేరలేని పరిస్ధితి వీరిది. అటు చైనా, పాకిస్తాన్ నుంచి సవాళ్లు ఎదురవుతున్న వేళ ఎన్డీయే నుంచి తప్పుకుంటే విమర్శలు ఎదురవుతాయన్న భయం కూడా అకాలీలను వెంటాడుతోంది. అందుకే వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించినంత సులువుగా ఎన్డీయేను వ్యతిరేకించలేని పరిస్ధితి అకాలీల మందు నిలిచింది. దీంతో ప్రస్తుతం అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిపై చర్చిస్తున్నారు.
Recommended Video
వెంటాడుతున్న టీడీపీ అనుభవాలు...
2018లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న కారణంతో కేంద్ర ప్రభుత్వంలోని తమ ఇద్దరు మంత్రులతో రాజీనామా చేయించిన టీడీపీ.. కేంద్రం నుంచి తప్పుకున్నాక ఎన్డీయేలో ఉండటమేంటన్న విమర్శలతో గుడ్ బై చెప్పేసింది. అంతటితో ఆగకుండా ప్రత్యర్ధులతో పోటీ పడుతూ బీజేపీపై ధర్మపోరాటం చేసింది. చివరికి సార్వత్రిక ఎన్నికల్లో తగిలిన దెబ్బతో ఇప్పటికీ బీజేపీకి దగ్గరకాలేని పరిస్దితులను టీడీపీ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అనుభవాలు కూడా అకాలీలను వెంటాడుతున్నాయి. ఓసారి బీజేపీకి దూరమైతే ఎటూ కాకుండా పోతామనే భయం ఓవైపు, సరిహద్దుల్లో నెలకొన్న పరిణామాలు మరోవైపు, పంజాబ్లో రైతుల ఆందోళన మరోవైపు అకాలీలను నిద్రలేకుండా చేస్తున్నాయి. అయితే ఇవాళ, రేపట్లో ఎన్డీయేలో కొనసాగే అంశంపై అకాలీదళ్ తుది నిర్ణయం తీసుకోనుంది.