బీఫ్ బ్యాన్పై అసెంబ్లీలో చర్చ: బీఫ్తో బ్రేక్ఫాస్ట్ చేసి మరీ వెళ్లారు!
గోవుల క్రయ విక్రయాలపై కేంద్రం విధించిన నిబంధనలపై చర్చించేందుకు కేరళ అసెంబ్లీ గురువారం ప్రత్యేక సెషన్ ద్వారా సమావేశమైంది.
తిరువనంతపురం: కేంద్రం తీసుకున్న గోవధ నిషేధ నిర్ణయానికి వ్యతిరేకంగా మొదటి నుంచి తన వాదనను వినిపిపిస్తున్న కేరళ ప్రభుత్వ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. గోవుల క్రయ విక్రయాలపై కేంద్రం విధించిన నిబంధనలపై చర్చించేందుకు కేరళ అసెంబ్లీ గురువారం ప్రత్యేక సెషన్ ద్వారా సమావేశమైంది.
సాధారణంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అక్కడి క్యాంటీన్లో ఉదయం 11 గంటల తర్వాతే బీఫ్ వండుతారు. కానీ, బీఫ్ గురించి చర్చ కోసం సమావేశం అవుతున్నందుకుగాను ప్రత్యేకంగా వండించడం గమనార్హం. సమావేశానికి హాజరయ్యే ముందు కేరళ శాసనసభ్యులు బీఫ్తో చేసిన బ్రేక్ఫాస్ట్ను ఆరగించి మరీ ఈ చర్చలకు వెళ్లారు.
శాసనసభ్యుల కోసం ఉదయమే పది కేజీల మాంసాన్ని తీసుకొచ్చినట్లు క్యాంటీన్ ఉద్యోగి ఒకరు చెప్పారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు బీఫ్ఫ్రైతో బ్రేక్ఫాస్ట్ ముగించుకొని అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారని ఆయన తెలిపారు.
పశువుల సంతల్లో మాంసం కోసం వధించేందుకు గోవుల విక్రయాలు చేపట్టడంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం నిర్ణయాన్ని తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీలో తీర్మానం చేయడం గమనార్హం.