రాష్ట్రంపై మరో పంజా: దూసుకొస్తున్న లెహర్ తుఫాను
హైదరాబాద్: ఫైలిన్, హెలెన్ తర్వాత రాష్ట్రానికి లెహర్ తుఫాను ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఆ రెండు తుపానులు మిగిల్చిన నష్టాల లెక్కలు తేలకముందే, హెలెన్ రాష్ట్రంపై పంజా విసిరే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. ఫైలిన్ మాదిరిగానే లెహర్ కూడా పెను విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్రంలో కేంద్రీకృతమై ఉన్న లెహర్ తుపాను ఆదివారం మధ్య రాత్రికి అండమాన్ నికోబార్ ద్వీపాలను పోర్ట్బ్లెయిర్ వద్ద దాటుతుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సోమవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతానికి చేరుతుందని, అదే సమయంలో తీవ్ర తుపానుగా మారొచ్చని ఐఎండి ప్రకటించింది.
ఇది నైరుతీ వైపు వెళ్లి, ఈనెల 28న మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ కోస్తాలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. పోర్టుబ్లెయిర్కు దక్షిణ ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ తీవ్ర వాయుగుండానికి వాతావరణ శాఖ లెహర్గా నామకరణం చేసింది. ఇది కాకినాడ తీరానికి 1100 కిలో మీటర్ల దూరంలో ఉంది.
పోర్టుబ్లెయిర్ నుంచి ఆగ్నేయంగా కదులుతూ బంగాళాఖాతంలో ప్రవేశించనుందని అంచనా వేస్తున్నారు. ఫైలిన్ తుపాను తీరాన్ని తాకే సందర్భంలో ఎంత ఉద్ధృతంగా ఉందో లెహర్ తుపాను అంతటి ప్రభావంతో దూసుకొస్తొందని చెబుతున్నారు. దీని ప్రభావంతో గంటకు 120 అంతకంటే ఎక్కువ కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు.
మచిలీపట్నం- కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. లెహర్ తుఫాను కారణంగా అండమాన్ నికోబర్ దీవుల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. 25 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశముంది.