యూఎన్ భద్రతా మండలిలో భారత్: భారీ మద్దతుకు ప్రధాని మోడీ బిగ్ థ్యాంక్స్
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఎన్నికల్లో భారత్ విజయం సాధించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భద్రతా మండలిలో భారత్కు మద్దతు తెలిపిన యావత్ ప్రపంచ దేశాలకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు.
ప్రపంచ శాంతి, సమానత్వం నెలకొల్పడంలో సభ్యదేశాలతో కలిసి భారత్ పనిచేస్తుందని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. 193 సభ్యదేశాలు కలిగిన యూఎన్ఎస్ఎస్సీలో 2021-2022 సంవత్సరాలకు గాను భారత్ మరోసారి ఎన్నికైన విషయం తెలిసిందే.
మొత్తం 192 ఓట్లు పోలవగా.. భారత్కు 184 దేశాల మద్దతు లభించింది. పాకిస్థాన్,చైనా కూడా మనదేశానికి మద్దతుగా ఓట్లు వేయడం గమనార్హం. కాగా, ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యదేశాలుగా ప్రస్తుతం అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యా దేశాలు మాత్రమే ఉన్నాయి.
Deeply grateful for the overwhelming support shown by the global community for India's membership of the @UN Security Council. India will work with all member countries to promote global peace, security, resilience and equity.
— Narendra Modi (@narendramodi) June 18, 2020
Recommended Video
అయితే, శాశ్వత సభ్యదేశాలు కాని సభ్యుల కోసం ప్రతి రెండేళ్లకోసారి ఎన్నిక జరుగుతుంది. దీనిలో భాగంగా బుధవారం జరిగిన ఎన్నికల్లో భారతదేశానికి మెజార్టీ దేశాలు మద్దతు పలికాయి. భారత్ తోపాటు ఐర్లాండ్, మెక్సికో, నార్వే దేశాలు కూడా ఈ ఎన్నికల్లో గెలుపొందాయి. కెనడా మాత్రం ఓటమిపాలైంది. భారత ప్రధాని మోడీ ప్రపంచ దేశాలతో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంటున్న నేపథ్యంలోనే మనదేశానికి పెద్ద ఎత్తున దేశాలు మద్దతు పలికినట్లు తెలుస్తోంది.