జగన్ బాటలోనే నితీశ్ కుమార్- సోషల్ పోస్టులపై ఉక్కుపాదం- అరెస్టు చేయాలన్న తేజస్వీ
ఏపీలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం... తమకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతోంది. సీఐడీ సాయంతో ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు పెట్టించి అరెస్టులు కూడా చేసింది. ఇప్పుడు జగన్ బాటలోనే బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా సోషల్ మీడియాపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు.
బీహార్లో ప్రభుత్వం, మంత్రులు అధికారులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టినా ఇకపై సైబర్ క్రైమ్ చట్టం కింద కేసులు నమోదు చేయాలని నితీశ్ కుమార్ సర్కారు నిర్ణయించింది. రాష్ట్ర పోలీసు శాఖలోని ఆర్ధిక నేరాల విభాగాన్ని నోడల్ ఏజెన్సీ కింద నియమిస్తూ సీఎం నితీశ్ ఆదేశాలు ఇచ్చారు. సీఎం నితీశ్ నిర్ణయం మేరకు పోలీసుశాఖలో ఆర్ధిక నేరాల ఐజీ నయ్యర్ హస్నైన్ ఖాన్ ఈ మేరకు అన్ని శాఖల అధికారులకు లేఖలు రాశారు. తమకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ఫిర్యాదులు చేయాలని సూచించారు. రాష్ట్రంలో కొందరు ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్లమెంటేరియన్ల పరువుకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని ఈ లేఖలో ఐజీ పేర్కొన్నారు.
నితీశ్ సర్కారు నిర్ణయంపై బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ భగ్గుమన్నారు. నితీశ్ భీష్ముడిలా వ్యవహరిస్తున్నారని, తాను పెట్టిన పోస్టులపై దమ్ముంటే అరెస్టు చేయాలని నితీశ్కు సవాల్ విసిరారు. సీఎం నితీశ్ అవినితి పరులను, నేరస్తులను కాపాడుతూ సోషల్ మీడియాలో భావప్రకటన చేసిన వారిపై సైబర్ క్రైమ్ చట్టాలు ప్రయోగిస్తారా అని తేజస్వీ ప్రశ్నించారు. రాష్ట్రంలో మిగతా విపక్షాలు కూడా నితీశ్ చర్యపై మండిపడుతున్నాయి. విపక్షాలను లక్ష్యంగా చేసుకుని నితీశ్ ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నాయి.