కరుణానిధి జయలలితల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణంతో తమిళ రాజకీయాల్లో మరో శకం ముగిసినట్లు అయ్యింది. అన్నాదురై తర్వాత తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు కక్షచర్య సాధింపు రాజకీయాలుగానే మిగిలిపోయాయి. ఎమ్జీఆర్తో కరుణానిధి విభేదాలు... ఎమ్జీఆర్ బతికున్న సమయం వరకు కరుణానిధికి సీఎం పీటం అందని ద్రాక్షాలానే మిగిలిపోయింది. ఇక ఆ తర్వాత రామచంద్రన్ రాజకీయవారసురాలిగా జయలలిత అరంగేట్రంతో ఆ యుద్దం కరుణానిధి జయలలితల మధ్య కొనసాగింది.
Recommended Video
ఎవరీ కరుణానిధి? ఇదీ రాజకీయ నేపథ్యం-ఎన్నో రికార్డ్లు: కీలక అంశాలు
ఇక కరుణానిధి జయలలితలకు సినిమా రంగమే పరిచయ వేదికగా మారింది. 1966లో జయలలిత నటించిన మనిమగుటం సినిమాకు కరుణానిధే కథ అందించారు. అయితే జయలలిత రాజకీయ అరంగేట్రంతో డీఎంకే వ్యక్తిగతంగా టార్గెట్ చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతారు. 1982లో జయలలిత తొలిసారిగా రాజకీయ ప్రసంగం కడలూరులో చేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న జనం ఆమె ప్రసంగం వినేందుకు రాలేదని... కేవలం ఒక అందమైన హీరోయిన్ను చూసేందుకు వచ్చారని జయలలిత ఆత్మకథ రాసిన వాసంతి చెబుతారు. ప్రసంగం అద్భుతంగా చేసినప్పటికీ ఆమె రాజకీయ ఎంట్రీని కడలూరు కేబ్రెట్గా డీఎంకే అధికార పత్రిక పేర్కొంది. 1989లో తమిళనాడులో అసెంబ్లీలో జరిగిన ఘటన ఎప్పటికీ చరిత్రలో ఒక పీడకలలా నిలిచిపోతుంది.
సినీ-రాజకీయాల్లో చెరగని ముద్ర: ఎంజీఆర్ ఎంట్రీతో ప్రతిపక్షంలోనే!: కరుణానిధి ప్రస్థానం
తమిళనాడు అసెంబ్లీలో జయకు అవమానం
తన ఫోన్ కాల్స్ను డీఎంకే ప్రభుత్వం టాప్ చేస్తోందని జయలలితా ఆరోపించారు. ఆ సమయంలో కరుణానిధి చేసిన వ్యాఖ్యలు ఆమెను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి.ఆ తర్వాత గందరగోళ పరిస్థితి నెలకొంది. అప్పుడే జయలలిత చీరను లాగే ప్రయత్నం చేశారు డీఎంకే నేత దురైమురుగన్. ఆ రోజును తమిళనాడు రాజకీయాల్లో దుర్దినంగా పలు జాతీయ పత్రికలు అభివర్ణించాయి. వెంటనే బయటకు వచ్చిన జయలలిత తిరిగి తాను అధికారం చేపట్టేవరకు తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెట్టనని ప్రమాణం చేసింది. పురుషాధిక్యాన్ని ఉక్కుపాదంతో తొక్కేస్తానని ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
2001లో కరుణానిధిని అర్థరాత్రి అరెస్టు చేయించిన జయలలిత
రెండేళ్ల తర్వాత 1991లో జయలలిత అధికారంలోకి వచ్చింది. అన్నాడీఎంకే మొత్తం 225 సీట్లలో గెలుపొందగా డీఎంకే పార్టీకి ఏడు సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే అసెంబ్లీలో జయలలితకు జరిగిన అవమానం.. ఆ తర్వాత ఘటనపై కరుణానిధి ఒక్క ప్రకటన కూడా చేయకపోవడంతోనే జయలలితకు తమిళ ప్రజలు భారీ విజయాన్ని అందించారని నాటి బ్యూరోక్రాట్లు చెబుతుంటారు. 90వ దశకంలో జయలలిత పై వచ్చిన అవినీతి ఆరోపణలు రావడంతో ఆమె అరెస్టు అయ్యారు. తిరిగి 2001లో జయలలిత సీఎంగా బాధ్యతలు చేపట్టగానే కరుణానిధిని ఫ్లైఓవర్ కేసులో అరెస్టు చేయించి కక్ష తీర్చుకున్నారు. అది కూడా అర్థరాత్రి కరుణానిధి ఇంటికెళ్లిన పోలీసులు ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా సాధారణ వ్యక్తిని ఎలా అయితే అరెస్టు చేస్తారో... అలానే కరుణానిధిని లాక్కెళ్లి జీపులో కూర్చోబెట్టారు.
2016లో జయ ప్రమాణస్వీకార కార్యక్రమంలో స్టాలిన్కు అవమానం
తమిళ ప్రజలు ఎప్పుడూ అధికారం ఒకరికే అప్పజెప్పలేదు. ఒక దఫా డీఎంకేకు అధికారం కట్టబెడితే మరోదఫా అన్నాడీఎంకేకు పదవి ఇచ్చారు. కానీ 2016లో మాత్రం డీఎంకే పార్టీలో కొన్ని లుకలుకలు బయటపడటంతో రెండోసారి జయలలిత సీఎం పీటాన్ని అధిరోహించారు. 2016 ఎన్నికల్లో డీఎంకే 89 స్థానాలు గెలుపొంది ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. జయలలిత ప్రమాణస్వీకార కార్యక్రమంలో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్కు రెండో వరసలో కుర్చీ వేసి అవమానించారు. కావాలనే జయలలిత స్టాలిన్ను అవమానించారని కరుణానిధి మండిపడ్డారు. జయలలిత మారలేదు... ఇకపై మారదు కూడా అంటూ కలైంజ్ఞర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో స్టాలిన్ను అవమానించాలనే ఉద్దేశం తనకు లేదని జయలలిత స్పందించారు.
తమిళ రాజకీయాల్లో ముగిసిన ముగ్గురి ప్రస్థానం
ఇదిలా ఉంటే ... రాజకీయంగా కరుణానిధి, ఎమ్జీఆర్లకు విభేదాలుండేవి కానీ.... వ్యక్తిగతంగా కలైంజ్ఞర్ అంటే ఎమ్జీఆర్కు ఎనలేని ప్రేమ ఉండేదని వారిని దగ్గర నుంచి చూసినవారు చెబుతుంటారు. కరుణానిధిని ఎవరైనా పేరుపెట్టి పిలిస్తే వారిపై ఎమ్జీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసేవారని... కలైంజ్ఞర్ అని పిలవాల్సిందిగా ఆదేశించేవారని సన్నిహితులు చెబుతుంటారు. అంతేకాదు ఎమ్జీఆర్ చనిపోయిన సమయంలో ముందుగా ఇంటికి చేరుకుంది కరుణానిధే అని... తన స్నేహితుడిని కోల్పోయినందుకు ఎంతో బాధపడ్డారని దగ్గరి మిత్రులు చెబుతారు. ఎమ్జీఆర్ను అలా చూసి కరుణానిధి కన్నీటిపర్యంతం అయ్యారని ఆయన్ను ఓదార్చడం ఎవరి తరం కాలేదని గుర్తుచేసుకున్నారు.
ఇప్పుడు కరుణానిధి మరణంతో తమిళ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ముగ్గురు బలమైన నాయకులను ఒక తరం చూసింది.ఎవరికి వారే తమ రాజకీయ చతురతను ప్రదర్శించిన నేతలను తమిళనాడు చూసింది. అలాంటి రసవత్తర రాజకీయాలు భవిష్యత్తులో ఇక ఉండబోవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.