జూన్ 6 నుంచి ప్రత్యేక విమానాల్లో ‘మధ్య సీటు’ ఖాళీగానే ఉండాలి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను తిరిగి తీసుకొచ్చేందుకు నడుపుతున్న ప్రత్యేక విమానాల్లో మధ్య సీటును ఖాళీగా వదిలివేయాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు బుకింగ్ చేసుకున్న విమానాలు మినహా.. జూన్ 6 నుంచి ఆ అంతర్జాతీయ విమానాల్లో మధ్య సీటు ఖాళీగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది.
Recommended Video
ప్రజల ఆరోగ్యం ముఖ్యమా? ఎయిర్లైన్స్దా?: 'మధ్య సీటు’పై కడిగిపారేసిన సుప్రీంకోర్టు
కరోనా కట్టడి కోసం ఇంగిత జ్ఞానం ఉంటే ఆ మధ్య సీటును సామాజిక దూరం నిబంధన కింద వదిలేస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజల ఆరోగ్యం కంటే విమనాయాన సంస్థల లాభంపైనే ప్రభుత్వం దృష్టి సారించినట్లుందని కోర్టు మండిపడింది. ఎయిరిండియా పైలట్ దేవేన్ యోగేశ్ కణని మధ్య సీటు విషయమై బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో ఆ సీటు ఖాళీగానే ఉంచాలని ఆదేశించింది.
విమానాల్లో సామాజిక దూరం అవసరం లేదని కేంద్రం భావిస్తోందా? మార్గదర్శకాల్లో మాత్రం 6 అడుగుల దూరం పాటించాలని చెబుతున్నారు? ఇక్కడ ఎందుకు పాటించరు? అని చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. భుజానికి భుజం తాకేలా సీట్లలో కూర్చోవడం చాలా ప్రమాదకరమని, ఇది ప్రభుత్వ నిబంధనలకు కూడా విరుద్ధమేనని వ్యాఖ్యానించిది.
కేంద్రం, డీజీసీఏ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. పరీక్షలు పెంచామని, విమానాల్లో వచ్చిన వారిని క్వారంటైన్ కూడా చేస్తున్నామని.. విమానాల్లో మధ్య సీట్లను ఖాళీగా ఉంచడం వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదని మెహతా వాదించారు. అయితే, కోర్టు మాత్రం ఆయన వాదనలను కొట్టిపారేసింది. బహిరంగ ప్రదేశాల్లో 6 ఫీట్లు దూరం ఉండాలని చెబుతున్న మీరే.. ఇక్కడ మాత్రం ఒక సీటు వదిలేయలేరా? అని నిలదీసింది. దీని వల్ల కరోనా రాదని మీరు ఎలా చెప్పగలరు? అని ప్రశ్నించింది.
విమానాల్లో మధ్య సీటును వదిలేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై డీజీసీఏ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే దేశీయ విమానాల్లో కూడా మధ్య సీటును వదిలేయాలని రెండు నెలలపాటు వదిలేయాలని స్పష్టం చేసింది. భౌతిక దూరం పాటించడం అనేది సాధారణ విషయమే కాదా? అని పేర్కొంది.