కంగనా వివాదం - ఎయిర్లైన్స్ కు డీజీసీఏ సీరియస్ వార్నింగ్- అలా చేస్తే సస్పెన్షన్..
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విమానంలో ముంబయి చేరుకున్న నేపథ్యంలో ఆమె ప్రయాణించిన విమానంలో కొందరు ఫొటోలు, వీడియోలు తీసిన ఘటన కలకలం రేపుతోంది. దీంతో కేంద్రం ఈ వ్యవహారంపై సీరియస్ అయింది. కేంద్ర పౌరవిమానయాన శాఖ ఆదేశాలతో డీజీసీఏ ఎయిర్లైన్స్కు కఠిన హెచ్చరికలు చేసింది.
విమానాల్లో ప్రయాణికులు ఇతరుల ఫొటోలు, వీడియోలు తీస్తే కఠిన చర్యలు తప్పవని డీజీసీఏ ఇవాళ ఎయిర్లైన్స్కు జారీ చేసిన హెచ్చరికల్లో పేర్కొంది. ప్రయాణికుల ప్రైవసీకి భంగం కలిగే విధంగా ఫోటోగ్రఫీ చట్ట విరుద్దమని పేర్కొంది. చంఢీఘడ్ నుంచి ముంబైకి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రయాణించిన ఘటనలో ఫోటోగ్రఫీపై విమర్శలు చెలరేగిన విషయాన్ని డీజీసీఏ ఎయిర్లైన్ సంస్దలకు గుర్తు చేసింది. ఇకపై కేంద్రం మార్గదర్శకాలు పాటించకుండా ఫొటోగ్రఫీకి అనుమతిస్తే రెండు వారాల పాటు సస్పెన్షన్ విధిస్తామని హెచ్చరించింది. దీంతో ఎయిర్లైన్స్ సంస్దలకు ముకుతాడు వేసినట్లయింది.
డీజీసీఏలోని ఉన్నతాధికారుల ముందస్తు అనుమతితోనే విమానాల్లో ఫొటోగ్రఫీకి అనుమతించాలని, అలా కాకుండా ఇష్టారాజ్యంగా అనుమతిస్తే కఠిన చర్యలకు వెనుకాడబోమని విమానయాన సంస్ధలకు హెచ్చరికలు వెళ్లాయి. విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో అది కూడా కుదరదని డీజీసీఏ తేల్చిచెప్పింది. ఇకపై విమానాల్లో ఫొటోగ్రఫీ ఘటనలు జరిగి సస్పెన్షన్ విధిస్తే నిందితులపై చర్యలు తీసుకున్న తర్వాతే సదరు విమానాలను గాల్లోకి ఎగిరేందుకు అనుమతిస్తామని డీజీసీఏ తమ ఆదేశాల్లో పేర్కొంది.