కేరళ తర్వాత పంజాబ్: సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం..సుప్రీంకు అమరీందర్ సర్కార్
చండీగఢ్: దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న క్రమంలో కేరళ అసెంబ్లీ కొద్దిరోజుల క్రితం సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. ఇప్పుడు అదే బాటలో పంజాబ్ కూడా నడుస్తోంది . పంజాబ్ అసెంబ్లీలో పౌరసత్వ సవరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పాస్ చేసింది. గత నెలలో పార్లమెంటు పాస్ చేసిన పౌరసత్వ సవరణ చట్టంను రద్దు చేయాలని పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరింగింది.
సుప్రీంకోర్టుకు వెళతామన్న సీఎం అమరీందర్ సింగ్
పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పాస్ చేసిన తర్వాత పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మాట్లాడారు. అంతేకాదు సీఏఏపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అమరీందర్ సింగ్ చెప్పారు. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ 60కి పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిలో కేరళ ప్రభుత్వం పిటిషన్ కూడా ఒకటి ఉండగా.. త్వరలో ఈ క్లబ్లో పంజాబ్ ప్రభుత్వం కూడా చేరనుంది. మత ప్రాతిపదికన ఒక పౌరుడికి పౌరసత్వం కల్పించడం సరైన పద్ధతికాదని పేర్కొంటూ పిటిషన్లు దాఖలయ్యాయి.
సీఏఏ లాంటి చట్టాలు ప్రజాస్వామ్యంకు ప్రమాదకరం
ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరిని సమానంగా చూడాలని రాజ్యాంగం చెబుతుంటే కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ప్రజలను మత ప్రాతిపదికన వేరుచేసి చిచ్చు పెట్టేలా ఉందంటూ అమరీందర్ సర్కార్ తీర్మానంలో పేర్కొంది. స్వేచ్చా నిజాయితీతో కూడిన ప్రజాస్వామ్యంలో ఇలాంటి చట్టాలు తీసుకురావడం ప్రమాదమని సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. ఓ వైపు మత ప్రాతిపదికన పౌరసత్వం కల్పించి ప్రజల మధ్య చిచ్చు పెడుతూ మరోవైపు కొన్ని వర్గాల సంస్కృతులు, భాషలపై కూడా ఈ చట్టం ప్రభావం చూపే అవకాశం ఉందని అమరీందర్ సింగ్ పేర్కొన్నారు.
తీర్మానంకు మద్దతు తెలిపిన ఆప్
పంజాబ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంకు ఆమ్ఆద్మీ పార్టీ, లోక్ ఇన్సాఫ్ పార్టీలు మద్దతు తెలిపాయి. మరోవైపు ప్రతిపక్షమైన బీజేపీ తీర్మానంను వ్యతిరేకించింది. బీజేపీ మిత్రపక్షమైన శిరోమణి అకాళీదల్ కూడా తీర్మానంను వ్యతిరేకిస్తూనే చట్టంలో మార్పులు చేయాలని చెప్పింది. సీఏఏ పరిధిలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వారిని కూడా చేర్చాలని శిరోమణి అకాలీదల్ సూచనలు చేసింది. సీఏఏ చట్టంలో మతాల పేర్లను ప్రస్తావించకుండా మైనార్టీలు అనే పదం చేర్చి ఉంటే బాగుండేదని శిరోమణి అకాళీదల్ చీఫ్ సుఖ్భీర్ సింగ్ బాదల్ చెప్పారు. దేశంలో ఒక వర్గాన్ని ఒంటరి చేశామన్న భావనలో ఉండరాదని బాదల్ చెప్పారు.
ఎన్పీఆర్పై కాంగ్రెస్ను ఇరుకున పెట్టిన శిరోమణి అకాళీదల్
మన్మోహన్ సింగ్ హయాంలో ఎన్పీఆర్కు సంబంధించి రెండు సర్వేలు జరిగాయని గుర్తుచేసిన శిరోమణి అకాళీదల్ నేత శరణ్జీత్ సింగ్ ధిల్లాన్... ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తుందని చెప్పి హస్తం పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. సీఏఏ ,ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లు రాజ్యాంగ విరుద్ధమని, ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ఉందని ఈ వారం మొదట్లో జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం అమరీందర్ సింగ్ అన్నారు.