సుప్రీంకోర్టు..మారథాన్ కేసులు: నాడు కేశవానంద భారతి .. నేడు అయోధ్య
న్యూఢిల్లీ: చారిత్రాత్మక, దేశ చరిత్రను మలుపు తిప్పే శక్తి సామర్థ్యాలు ఉన్న కేసుగా గుర్తింపు పొందిన అయోధ్య భూ వివాదం కేసు విచారణను బుధవారం అత్యున్నత న్యాయస్థానం తెర దింపింది. అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు స్థలం ఎవరికి చెందాలనే విషయంపై దాఖలైన పిటీషన్లపై విచారణను ముగించింది. తీర్పును రిజర్వ్ లో ఉంచింది. ఈ కేసు విచారణ 40 రోజుల పాటు కొనసాగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సుప్రీంకోర్టు చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన రెండో కేసు విచారణగా చరిత్రను సృష్టించింది ఈ అయోధ్య భూ వివాద వ్యవహారం.
నాడు కేశవానంద భారతి..
కేరళకు చెందిన కేశవానంద భారతి కేసు సుప్రీంకోర్టు చరిత్రలో సుదీర్ఘకాలం పాటు కొనసాగింది. ఏకంగా 68 రోజుల పాటు ఈ కేసు విచారణ నడిచింది. 1973లో కేరళలోని కాసర్ గోడ్ జిల్లా ఎడ్నేర్ గ్రామంలో ఉన్న స్వామి కేశవానంద భారతి శ్రీపాదగల్వరు, కేరళ ప్రభుత్వం మధ్య ఈ కేసు కొనసాగింది. కేశవానంద భారతి ఆశ్రమానికి చెందిన మఠాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ ఈ కేసు దాఖలైంది. అయిదు మంది కాదు.. 10 మంది కాదు.. ఏకంగా 13 మంది న్యాయమూర్తులతో ఏర్పాటైన ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది.
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన కేసుగా..
చరిత్ర గతినే మార్చివేసిన కేసుగా దీన్ని అభివర్ణిస్తుంటారు న్యాయరంగానికి చెందిన విశ్లేషకులు. ఈ కేసు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్లుగా చెబుతుంటారు. 1973లో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ ఎం సిక్రీ నేతృత్వంలో జేఎం షెలట్, కేఎస్ హెగ్డే, ఏఎన్ గ్రోవర్, బీ జగన్మోహన్ రెడ్డి, డీజీ పాలేకర్, హెచ్ ఆర్ ఖన్నా, ఏకే ముఖర్జీ, యశ్వంత్ విష్ణు చంద్రచూడ్, ఏఎన్ రాయ్, కేకే మాథ్యూ, ఎంహెచ్ బేగ్, ఎస్ ఎన్ ద్వివేదీ ఈ కేసును విచారించారు. 68 రోజుల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసు కేశవానంద భారతికి అనుకూలంగా వెలువడింది. 13 మంది న్యాయమూర్తుల్లో నలుగురు ఈ తీర్పును వ్యతిరేకించారు. తీర్పు ప్రతులపై సంతకాలు చేయలేదు.
నేడు అయోధ్య..
ఇక అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన కేసుపై 40 రోజుల పాటు విచారణ కొనసాగింది. అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారణను కొనసాగించింది. అయోధ్యలో శ్రీరామచంద్రుడు జన్మించిన ప్రదేశంగా భావిస్తోన్న 2.77 ఎకరాల స్థలాన్ని రామ్ లల్లా విరాజ్ మాన్, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డులకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ కేసు దాఖలైంది. అప్పటి నుంచీ విచారణ కొనసాగుతూ వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 16వ తేదీ (బుధవారం) నాటికి విచారణను ముగిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ స్పష్టం చేయడం, చెప్పినట్టే విచారణను ముగించడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు.