కోల్కతా విద్యార్థుల ర్యాలీ: వివరణ కోరిన హోంశాఖ
న్యూఢిల్లీ: కోల్కతాలోని జాదవ్పూర్ యూనివర్సిటీ విద్యార్థులు మంగళవారం నిర్వహించిన ర్యాలీలో కొందరు అఫ్జల్గురుకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక పంపించాలని కోరింది.
పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష ఎదుర్కొన్న అఫ్జల్గురు వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన నేపథ్యంలోనే జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
అయితే మంగళవారం కోల్కతాలో కొందరు విద్యార్థులు కన్నయ్య కుమార్కు సంఘీభావం తెలుపుతూ అఫ్జల్గురుకు మద్దతుగా నినాదాలు చేశారు. అంతేగాక, కాశ్మీర్, మణిపూర్, నాగాలాండ్ స్వాతంత్ర్యం కావాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేసినట్లు సమాచారం.
కాగా, కోల్కతాలో యూనివర్సిటీ విద్యార్థుల వాదన మరోలా ఉంది. తమ ర్యాలీకి జేన్యూ వివాదానికి సంబంధం లేదని ఆ ర్యాలీ నిర్వాహకుడు ఒకరు తెలిపారు. తాము వేరే విషయంపై ర్యాలీ నిర్వహించామని, అంతలో కొందరు విద్యార్థులు వివాదాస్పదంగా నినాదాలు చేశారని అన్నారు.
ఆ నినాదాలు చేసినవాళ్లు బయటి వాళ్లు అయి ఉండవచ్చని, విద్యార్థులు కాకపోవచ్చని పేర్కొన్నారు. కాగా, జేఎన్యూ వివాదం సద్దుమణగకముందే మరో ఘటన జరగడంతో హోంశాఖ తక్షణమే స్పందించి పశ్చిమబెంగాల్ ప్రభుత్వ వివరణ కోరింది.