"నేను మంత్రిని.. నాకు క్వారంటైన్ గీరంటైన్లు ఉండవు" ఆ మంత్రి తీరుపై విమర్శలు
బెంగళూరు: " నేను మంత్రిని నాకు రూల్స్ గీల్స్ వర్తించవు " అని చెబుతున్నారు కేంద్రమంత్రి సదానందగౌడ. నాయకులు నిబంధనలు పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోడీ పదేపదే చెబుతున్నప్పటికీ ఆయన కేబినెట్ మంత్రులే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. సోమవారం నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్నారు కేంద్రమంత్రి సదానంద గౌడ. ఇక బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి.. నేరుగా అతని కారు ఎక్కి వెళ్లిపోయారు. అసలు స్టోరీ అంతా ఇక్కడే దాగి ఉంది.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎంతో తెలుసా..? గత 24 గంటల్లో ఒకరు మృతి
ఢిల్లీ నుంచి బెంగళూరుకు విమానంలో చేరుకున్న కేంద్రమంత్రి సదానంద గౌడ.. ఎయిర్పోర్టు నుంచి నేరుగా తన కారులో ఇంటికి వెళ్లిపోయారు. కోవిడ్-19 కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచి కర్నాటకకు చేరుకునే ప్రయాణికులకు తప్పనిసరిగా ప్రభత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లలో ఉండాలన్న నిబంధనను యడియూరప్ప సర్కార్ తీసుకొచ్చింది. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్రమంత్రి సదానంద గౌడను మాత్రం క్వారంటైన్ను తరలించలేదు. అయితే క్వారంటైన్ నగర పౌరులకు మాత్రమే అని చెప్పిన సదానంద తనలాంటి కేంద్రమంత్రులకు కాదని ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు.
ఒక కేంద్రమంత్రిగా క్వారంటైన్ నుంచి తనకు మినహాయింపు ఉందని చెప్పారు సదానంద గౌడ. అంతేకాదు తన ఫోన్లో ప్రభుత్వం సూచించిన ఆరోగ్యసేతు యాప్ ఉందని ఆ స్టేటస్ కూడా గ్రీన్ కలర్లో చూపుతున్నందున తను క్వారంటైన్లో ఉండాల్సిన పనిలేదని చెప్పుకొచ్చారు. ఇక కరోనావైరస్ పోరులో ముందువరసలో ఉండి సేవలందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందిని క్వారంటైన్లో ఉంచితే దాన్ని ఎలా పారద్రోలగలుగుతామని సదానంద గౌడ ప్రశ్నించారు. కెమికల్స్ ఫర్టిలైజర్స్ శాఖ మంత్రిగా తాను ఉన్నందున రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సరిపడ ఔషదాలు ఉన్నాయా లేదా అని చూడటం తన విధుల్లో భాగమని అలాంటప్పుడు తనను క్వారంటైన్లో ఉంచడం సరికాదని సమర్థించుకున్నారు.
ఇదిలా ఉంటే ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరుకు విమానంలో చేరుకునేవారిని ఏడు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన క్వారంటైన్లో ఉంచి ఆ తర్వాత కరోనా టెస్టులో నెగిటివ్ వస్తే ఇంటికి పంపి మరో ఏడు రోజుల పాటు హోంక్వారంటైన్లో ఉంచాలనే నిబంధన కర్నాటక ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నిబంధన అధిక కేసులున్న ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడుల నుంచి వచ్చే ప్రయాణికులకు వర్తిస్తుందని పేర్కొంది. అయితే ఈ నిబంధన నుంచి రాష్ట్ర కేంద్రమంత్రులకు మినహాయింపు ఉంటుందా లేదా అనేదానిపై స్పష్టత లేదు. ఇదిలా ఉంటే సోమవారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అయినందున ఆదివారమే చాలామంది కేంద్రమంత్రులకు కరోనావైరస్ పరీక్షలు నిర్వహించడం జరిగింది.