ఓటమి తెచ్చిన తంటా.. ఆర్థిక ఇబ్బందుల్లో కాంగ్రెస్... ఖర్చు తగ్గించుకోవాలని విభాగాలకు సూచన
న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయమే కాదు .. కాంగ్రెస్ పార్టీని ఆర్థిక ఇబ్బందులు కూడా పీడిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత చతికిలబడ్డ కాంగ్రెస్ పార్టీ .. క్రమంగా తన ఉనికిని కోల్పోతుంది. ఈ క్రమంలో ఆ పార్టీకి ఫైనాన్షియల్ క్రైసిస్ సమస్య కూడా మొదలైంది. దీంతో తమ విభాగాలు ఖర్చులు తగ్గించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచించింది. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ విభాగాల ఖర్చు తగ్గించుకోవాలని చూడడం ఆ పార్టీ ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతుంది.
Recommended Video
ఆగిన జీతాలు
కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలు, సోషల్ మీడియా టీం ఉంటుంది. వీరంతా పార్టీ కోసం పనిచేస్తున్న ఉద్యోగులే. వీరికి నెల నెల జీతం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ ఆర్థికంగా చితికిపోయింంది. ఈ క్రమంలో పార్టీ కీలక విభాగం కాంగ్రెస్ సేవాదళ్ ఖర్చులను తగ్గించుకోవాలని స్పష్టంచేసింది. సేవాదళ్ నెలకు రూ.2.5 లక్షలు ఖర్చు చేస్తోంది. అయితే దానిని రూ.2 లక్షలకు తగ్గించుకోవాలని తేల్చిచెప్పింది. మిగతా విభాగాలు కూడా తమ ఖర్చులను తగ్గించుకోవాలని స్పష్టంచేసింది.
సోషల్ మీడియాకు కూడా ..
ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు కీలకం సోషల్ మీడియా. కాంగ్రెస్ పార్టీకి 55 మంది సభ్యుల సోషల్ మీడియా బృందం ఉంది. పార్టీ విధాన నిర్ణయాలు, కీలక అంశాలపై ప్రతిస్పందనను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. అయితే ఎన్నికల తర్వాత మారిన పరిస్థితులతో 20 మంది సోషల్ మీడియా సిబ్బంది రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం 35 మంది మాత్రమే పనిచేస్తున్నారు. అయితే వారికి కూడా గత కొన్నిరోజులు జీతాలు ఇవ్వడం లేదు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ మహిళ విభాగం ఖర్చులను కూడా తగ్గించుకోవాలని హైకమాండ్ సూచించింది. అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని ఆర్థిక ఇబ్బందులు కూడా వేధించడం ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.
తగ్గిన ప్రభ
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవలం 52 సీట్లు గెలుచుకోవడంతో ఆ పార్టీ ప్రభ తగ్గుతూ వస్తోంది. 2014లో 44 సీట్లు గెలిచిన .. కాంగ్రెస్ సీట్ల సంఖ్య కేవలం 8 మాత్రమే పెరిగాయి. అధ్యక్షుడిగా ఎన్నికలకు వెళ్లిన రాహుల్ గాంధీ .. తమ పార్టీ విజయం సాధిస్తోందనే ధీమాతో ఉన్నారు. కానీ పరిస్థితి తలకిందులైంది. గుడ్డిలో మెల్ల అన్నట్టు ప్రతిపక్ష హోదాను సరిపెట్టుకుంది. దీంతో అధ్యక్ష పదవీకి అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామా కూడా చేశారు. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకున్నట్టు రాహుల్ స్పష్టంచేశారు.