వజ్రాల వ్యాపారికి రాజ్యసభ సీటు.. సింధియా బాటలో సచిన్ పైలట్.. బీజేపీ తాజా టార్గెట్ రాజస్థాన్
మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్య సింధియా ఇచ్చిన భారీ షాక్ తో కమల్ నాథ్ సర్కారు పతనం అంచుకు చేరింది. బీజేపీలో చేరనున్న సింధియాకు మద్దతుగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. ఇండిపెండెంట్, బీఎస్పీ, ఎస్పీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ పంచన చేరారు. మోదీ-షా మంత్రాంగం ఫలిస్తే.. మరికొద్ది గంటల్లోనే మధ్యప్రదేశ్ మళ్లీ బీజేపీ వశమైపోతుంది. ఇదే ఊపులో రాజస్థాన్ లోనూ పాగా వేసేందుకు కాషాయ దళం రెడీ అవుతున్నట్లు సమాచారం. ఎంపీలో సింధియాలాగే రాజస్థాన్ లో సచిన్ పైలట్ తో తిరుగుబాటు చేయించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రాజ్యసభ సీటుపై రగడ..
మధ్యప్రదేశ్ లో జ్యోతిరాదిత్యలానే రాజస్థాన్ లో సచిన్ పైలట్ సైతం కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. రాజస్థాన్ పీసీసీ చీఫ్ గా కాళ్లకు బలపంకట్టుకుని తిరిగి సచిన్ పార్టీని నిలబడితే.. సీఎం పదవిని మాత్రం అశోక్ గెహ్లాట్ ఎగరేసుకుపోయారు. హైకమాండ్ నచ్చెప్పడంతో డిప్యూటీ సీఎం పోస్టును స్వీకరించిన సచిన్.. చాలా కాలంగా కామ్ గా ఉంటున్నా.. తాజాగా రాజ్యసభ అభ్యర్థుల విషయంలో సీఎంతో గొడవపడ్డారు. దీన్నొక అవకాశంగా మలుచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.
తిరుగుబాటు తప్పదా?
ప్రముఖ వజ్రాల వ్యాపారి రాజీవ్ అరోరాను రాజస్థాన్ కోటా నుంచి రాజ్యసభకు పంపేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ నిర్ణయించారు. ఆ మేరకు హైకమాండ్ ను కూడా ఒప్పించగలిగారు. కానీ ఆ వజ్రాల వ్యాపారిని రాజ్యసభకు పంపడం సచిన్ పైలట్ కు సుతారమూ ఇష్టంలేదు. చాలా కాలంగా పార్టీనే నమ్ముకున్నవాళ్లు, గత ఎన్నికల్లో అన్ని రకాలుగా కాంగ్రెస్ కు అండగా నిలబడ్డవాళ్లను కాదని అరోరాకు ఎంపీ టికెట్ ఇవ్వడమేంటని సచిన్ ప్రశ్నించారు. కానీ ఆయన వాదనను ఎవరూ పట్టించుకోలేదు. ఈలోపే సచిన్ కు ఆప్తమిత్రుడైన జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయేలా తిరుగుబావుటా ఎగరేశారు. సచిన్ బీజేపీలో చేరేలా సింధియాతో మంత్రాంగం నిర్వహించాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే..
సచిన్ ఉరుకులు పరుగులు..
ఎంపీ లాగే రాజస్థాన్ లోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నప్పటికీ రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ మాత్రం మంగళవారం నాటికి పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉన్నారు. మధ్యప్రదేశ్ సహచరుడు సింధియాను బుజ్జగించేందుకు సచిన్ విఫలయత్నం చేశారు. హైకమాండ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సచిన్.. హుటాహుటిన సింధియాతో మంతనాలు జరిపారు.
అంత ఈజీ కాదు..
మధ్యప్రదేశ్ లో 22 మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించడం ద్వారా గద్దెనెక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే రాజస్థాన్ లో మాత్రం ఆ పని అంత ఈజీ కాదు. మొత్తం 200 స్థానాలున్న రాజస్థాన్ లో కాంగ్రెస్ కు 120 మంది ఎమ్మెల్యేల బలముంది. బీజేపీకి 72, ఆర్ఎల్పీ 3, సీపీఐ 2, భారతీయ ట్రైబల్ పార్టీకి 2, ఆర్ఎల్టీకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే సచిన్ పైలట్ ఏకంగా సగం మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చాల్సి ఉంటుంది. ప్రాక్టికల్ గా అది వర్కౌట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ.
ద్రోహం.. ద్రోహం..
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడుతూ సింధియా వ్యవహరించిన తీరుపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఘాటుగా స్పందించారు. ‘‘సింధియా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశాడు. సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చాడు. తన అధికార దాహాన్ని మరోసారి ప్రదర్శించాడు. చరిత్రలో అతనో ద్రోహిగా మిగిలిపోతాడు''అని విమర్శించారు. దేశమంతటా బీజేపీ పతనం చెందుతున్న తరుణంలో ఆ పార్టీలోకి సింధియా చేరడం ఆత్మహత్యాసదృశ్యమని గెహ్లాట్ అన్నారు.
బీజేపీపై విమర్శలు..
ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ పతనమవుతుండటం.. వరుసగా బ్యాంకుల దీవాలా.. పెరుగుతోన్న నిరుద్యోగం.. ఢిల్లీలో మతకల్లోలాలు.. కరోనా వైరస్ విజృంభణ.. తదితర సమస్యల్ని పరిష్కరించడంలో ఫెయిలైన బీజేపీ.. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి కొత్త నాటకం మొదలుపెట్టిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. సోషల్ మీడియాలోనూ మధ్యప్రదేశ్ పరిణామాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సింధియా ఇలా చేసే అవకాశాలున్నట్లు ముందునుంచే తెలిసినా కాంగ్రెస్ హైకామాండ్ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం వల్లే మధ్యప్రదేశ్ లో అధికారం కోల్పోయే పరిస్థితి తలెత్తిందనే వాదన కూడా వినబడుతోంది.