రాజపూజ్యం-1, అవమానం-5: 12 నెలల్లో అయిదు రాష్ట్రాలను కోల్పోయిన కమలం..!
న్యూఢిల్లీ: వరుసగా రెండేళ్లు. అయిదు రాష్ట్రాలను చేజార్చుకుంది భారతీయ జనతా పార్టీ. హర్యానాను మినహాయిస్తే.. ఈ మధ్యకాలంలో ఎదుర్కొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాలను చవి చూసింది. హర్యానాలో కూడా బీజేపీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయిన చందమే. హంగ్ అసెంబ్లీ ఏర్పడిన హర్యానాలో చివరి నిమిషంలో దుష్యంత్ చౌతాలా ఆదుకోకపోయి ఉంటే.. ఆ రాష్ట్రం కూడా కాంగ్రెస్ ఖాతాలో చేరిపోయి ఉండేదే.
కాషాయానికి కషాయ ఘాటు: జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి పాగా: ముఖ్యమంత్రి ఎవరో తేల్చేసిన కాంగ్రెస్..!
అయిదు రాష్ట్రాల్లో చేదు ఫలితాలు..
12 నెలల వ్యవధిలో కమల నాథులు అయిదు రాష్ట్రాల్లో చేదు ఫలితాలను చవి చూశారు. గత ఏడాదే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లకు నిర్వహించిన ఎన్నికల్లో ఓటమి పాలైంది బీజేపీ. ఆ మూడు చోట్లా అధికారాన్ని కోల్పోయింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. ఈ ఏడాది మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించగా.. ఈ రెండు చోట్లా కమలానికి ఎదురు దెబ్బే తగిలింది.
హర్యానాలో ఆదుకున్న దుష్యంత్.. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ
హంగ్ అసెంబ్లీ ఏర్పడిన హర్యానాలో చివరి నిమిషంలో దుష్యంత్ చౌతాలా రూపంలో బీజేపీకి అదృష్టం వరించింది. ఇక మహారాష్ట్రలో చోటు చేసుకున్న పొలిటికల్ హైడ్రామాను ఇప్పట్లో బీజేపీ నాయకులే కాదు.. సాధారణ ప్రజలు కూడా ఎవరూ విస్మరించలేరు. మిత్రపక్షం ప్రతిపాదించిన 50:50 ఫార్ములాను తిరస్కరించినందువల్ల ఏకంగా అధికారానికే దూరమైంది బీజేపీ. బీజేపీని అధికారానికి దూరం చేయడానికి మిత్రపక్షం శివసేన ఎత్తులకు పైఎత్తులు వేసింది. కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ లతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది.
స్ట్రెయిట్ ఫైట్.. డిఫీట్..
హర్యానా, మహారాష్ట్రల పరిస్థితి అలా ఉంటే.. జార్ఖండ్ లో ముఖాముఖి పోరులో ఓటమి పాలైంది బీజేపీ. కాంగ్రెస్-జార్ఖండ్ ముక్తిమోర్చా-రాష్ట్రీయ జనతాదళ్ కూటమిని ఢీ కొట్టలేక చతికిల పడింది. అధికారాన్ని కోల్పోయింది. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. పైగా అవన్నీ బెడిసి కొట్టినట్టయ్యాయి. స్వయంకృతాపరాధంగా చెప్పుకొనే స్థితిని ఎదుర్కొంటోంది బీజేపీ.
కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకున్నా..
ఈ ఏడాదిలోనే కర్ణాటకలో అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది బీజేపీ. ఎలాంటి పరిస్థితుల్లో బీజేపీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందనే విషయం తెలిసిందే. ఆపరేషన్ కమలను చేపట్టి కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో లుకలుకలను పుట్టించగలిగిందనే ఆరోపణలు బీజేపీపై ఉన్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ కూటమి ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి ఆపరేషన్ కమల ప్రధాన కారణమని అంటున్నారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో అత్యధిక స్థానాలను దక్కించుకోగలిగింది.