టార్గెట్ చైనా! సత్తా చూపెట్టే చాన్స్.. ఇండియా, అమెరికా ‘యుద్ధ్ అభ్యాస్’!!
చైనా లక్ష్యంగా.. భారత్, అమెరికా మరో సంయుక్త సైనిక విన్యాసాలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జపాన్తో కలిసి ఈ రెండు దేశాలు మలబార్ తీరంలో నేవీ సంయుక్త విన్యాసాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: చైనా లక్ష్యంగా.. భారత్, అమెరికా మరో సంయుక్త సైనిక విన్యాసాలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే జపాన్తో కలిసి ఈ రెండు దేశాలు మలబార్ తీరంలో నేవీ సంయుక్త విన్యాసాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు సెప్టెంబర్లో 'యుద్ధ్ అభ్యాస్' పేరుతో ఇండియా, అమెరికా ఆర్మీ సంయుక్త విన్యాసాలు నిర్వహించనున్నాయి. సెప్టెంబర్ 14 నుంచి 27 వరకు అమెరికాలోని లూయిస్-మెక్కోర్డ్ బేస్లో ఈ విన్యాసాలను నిర్వహించనున్నారు.
తరచూ ఇలాంటి ద్వైపాక్షిక మిలిటరీ విన్యాసాలతో తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలని అమెరికా, భారత్ భావిస్తున్నాయి. ఇండియా ప్రస్తుతానికి ఏ దేశ రక్షణ వ్యవస్థలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేకపోయినా.. చైనాకు అడ్డుకట్ట వేయడానికి ఈ సంయుక్త విన్యాసాలకు మాత్రం సై అంటున్నది. ఇది చైనా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
ఇప్పటికే మలబార్ తీరంలో మూడు దేశాల నేవీ విన్యాసాలను చైనా నిశితంగా పరిశీలించింది. ఏషియా, పసిఫిక్ ప్రాంతంలో ఇండియా తమకు ముఖ్యమైన రక్షణ భాగస్వామి అని అమెరికా రక్షణ, విదేశాంగ శాఖలు కాంగ్రెస్లో స్పష్టంచేశాయి.
ఇప్పుడు డోక్లామ్ ప్రాంతంలో ఇండియా, చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనే ఇండియా.. అమెరికాతో ఇలా వరుసగా మిలిటరీ విన్యాసాల్లో పాల్గొంటుండటం చైనాకు మింగుడు పడటం లేదు. ఈ 'యుద్ధ్ అభ్యాస్'లో గోర్ఖా రైఫిల్స్కు చెందిన 200 మంది జవాన్లు పాల్గొనబోతున్నారు.