ఫడ్నవీస్ సర్కార్కు మరో తలనొప్పి: తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఓ వర్గం డిమాండ్
ముంబై: మహారాష్ట్రలో మరో సామాజిక వర్గం తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ రోడెక్కింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా తమకు రిజర్వేషన్ కల్పిచాలని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలోనే జనవరి 22న సమస్త్ బ్రాహ్మిణ్ సమాజ్...ఆజాద్ మైదాన్లో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అక్కడ తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతామని చెప్పారు.
కేంద్రం కొన్ని రోజుల క్రితం తీసుకొచ్చిన 10శాతం రిజర్వేషన్ చట్టం అమలు చేయడం సాధ్యం కాదని.. దీనిపై ఎన్నో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని చెప్పారు సమస్త్ బ్రాహ్మిణ్ సమాజ్ కన్వీనర్ విశ్వజీత్ దేశ్పాండే. అందుకే బ్రాహ్మణ సమాజానికి ప్రత్యేక రిజర్వేషన్ కావాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు దేశ్పాండే చెప్పారు. అందుకే తమ వర్గంవారు అంతా జనవరి 22న పెద్ద సంఖ్యలో సమావేశమై తమ డిమాండ్లను తెలుపుతామని వెల్లడించారు.
మహారాష్ట్రలో ఇంకా పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులు ఆర్థికంగా వెనకబడి ఉన్నారని తెలిపారు. పూజారులుగా వారికి అందుతున్న వేతనాలు ఏమాత్రం సరిపోవడం లేదని వెల్లడించారు. ఈ క్రమంలోనే తాము 15 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచనున్నామని దేశ్పాండే వివరించారు. ఇందులో ఒకటి పూజారుల వేతనాలు రూ.5వేలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు బ్రాహ్మణుల కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. బ్రాహ్మణ విద్యార్థులకు హాస్టళ్లు, పీజీ వరకు ఉచిత విద్య కల్పించాలని డిమాండ్ చేశారు.