పంజాబ్లో మరో దారుణం: బస్సులో మహిళ పట్ల ఘోరం, పట్టించుకోలేదు
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని మోగాలో జరిగిన లైంగిక దాడులు మరవకముందే ఆదివారం నాడు మరో సంఘటన వెలుగు చూసింది. మోగా జిల్లాలో రెండు దారుణ సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఓ ఘటనలో బాలికను బస్సులో నుండి తోసివేయడంతో ఆమె మృతి చెందింది కూడా.
తాజాగా, ఖన్నా ప్రాంతంలో ఆదివారం నాడు మహిళను ఓ ప్రయివేటు బస్సులో లైంగికంగా వేధించారు. ఇందుకు సంబంఎధించి పోలీసులు సదరు ప్రయివేటు బస్సు డ్రైవర్, కండక్టర్ పైన కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. ఓ వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ప్రయివేటు బస్సులో ఆమె వెళ్తుండగా.. పక్కనున్న వ్యక్తి వేధించాడు. డ్రైవర్, కండక్టర్ సహాయాన్ని ఆమె కోరింది. అయితే వారు పట్టించుకోలేదు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను సదరు వ్యక్తి వేధిస్తున్నప్పటికీ బస్సు డ్రైవర్, కండక్టర్ పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు.
గత వారం బస్సులో ఓ బాలిక పైన లైంగిక దాడి జరిగింది. అనంతరం ఆ బాలికను బస్సులో నుండి కిందకు తోసేశారు. గాయాలపాలైన ఆ బాలిక మృతి చెందింది. అడ్డుకోబోయిన ఆ బాలిక తల్లిని కూడా బస్సులో నుండి తోసేశారు. ఇది లోకసభలోను ప్రకంపనలు సృష్టించింది. ఈ బస్సు ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కుటుంబానికి చెందినది. దీంతో, బాధిత కుటుంబానికి ముఖ్యమంత్రి రూ.30 లక్షలు ప్రకటించారు.