రాష్ట్రపతి రేసులో లేను: అద్వానీ సంచలన ప్రకటన, కారణాలివేనా?
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ శుక్రవారం నాడు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రపతి రేసులో తాను లేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో బీజేపీ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ శుక్రవారం నాడు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రపతి రేసులో తాను లేనని ఆయన స్పష్టం చేశారు. దీంతో బీజేపీ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయి.
పార్లమెంటు వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రణబ్ ముఖర్జీకి పదవీ కాలం ముగుస్తుండటంతో రాష్ట్రపతి ఎన్నికల కోసం కసరత్తు ప్రారంభమైంది. బీజేపీ నుంచి రాష్ట్రపతి రేసులో అద్వానీ ముందున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ కూడా అగ్రనేతకు సముచిత స్థానం కల్పించేందుకు ఇదే అవకాశమని భావిస్తున్నారు. మీడియా కూడా కాబోయే రాష్ట్రపతి అద్వానీ కావొచ్చునని చెబుతోంది. ఇలాంటి సమయంలో అద్వానీ సంచలన ప్రకటన చేశారు. తాను రేసులో లేనని తేల్చి చెప్పారు.
అద్వానీ సహ పలువురి పేర్లు
రాష్ట్రపతి రేసులో బీజేపీ అగ్రనేత అద్వానీతో పాటు పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. అందులో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ పేరు కూడా ఉంది. అయితే, ఇటీవలో ఆయన తాను రేసులో లేనని తేల్చి చెప్పారు. తాజాగా అద్వానీ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
మోడీపై అసంతృప్తి ఉందా?
ప్రధాని కావాలన్నది అద్వానీ కోరిక. కానీ 2014 ఎన్నికలకు ముందు ఆయన పేరును కాకుండా.. నరేంద్ర మోడీ పేరు తెరపైకి వచ్చింది. మోడీ ప్రధాని అభ్యర్థిగా విస్తృత ప్రచారం చేశారు. బీజేపీ అద్భుత విజయం సాధించింది. ఎన్నికలకు ముందే సీనియర్లు అసంతృప్తితో కాస్త మౌనంగా ఉన్నారు. అయితే, మోడీ ప్రధాని అయ్యాక.. ఇటీవలే పార్టీ అగ్రనేత అద్వానీకి సముచిత స్థానం కల్పించాలని భావించారు.
మోడీ ప్రకటన..
ఇదే విషయాన్ని ఇటీవల గుజరాత్లో పర్యటించినప్పుడు చెప్పారు. తనకు అద్వానీ గురువు అని, ఆయనకు సముచిత స్థానం కల్పించి గురుదక్షిణ తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. దీంతో రాష్ట్రపతిగా అద్వానీని చేస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. 2002 గోద్రా అల్లర్ల సమయంలో మోడీని తప్పించేందుకు వాజపేయి చూడగా, అద్వానీ ఆయనను కాపాడారు. అద్వానీ పట్ల మోడీ కృతజ్ఞతగా రాష్ట్రపతి పదవి ఇస్తారని అందరు భావిస్తున్నారు.
అద్వానీకి బాబ్రీ చిక్కు
బీజేపీ అగ్రనేత అద్వానీ రాష్ట్రపతి రేసులో లేనని ప్రకటించడం బీజేపీ వర్గాలను విస్మయానికి గురి చేసింది. మోడీపై అసంతృప్తి, బాబ్రీ కేసు తిరిగి తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఆయన ఇలా ప్రకటించారా అనే చర్చ సాగుతోంది.