ఉత్కంఠ: 6 గంటల తర్వాత ఏట్టకేలకు నామినేషన్ వేసిన కేజ్రివాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన దాదాపు ఆరుగంటలపాటు నామినేషన్ వేసేందుకు వరుసలో నిల్చుకోవడం గమనార్హం.
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సోమవారమే అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉండగా.. భారీ ర్యాలీ నిర్వహించడంతో ఆలస్యమైంది. దీంతో ఆయన నామినేషన్ వేయలేకపోయారు. నామినేషన్ పేపర్లు కూడా సరైన సమయానికి అందకపోవడం కూడా కారణమైంది.
ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ వేసేందుకు వెళ్లారు. నామినేషన్ దాఖలు చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆయన దాదాపు 6గంటలపాటు వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. తన టోకెన్ నెంబర్ 45 అని, నామినేషన్ పేపర్లతో భారీ సంఖ్యలో అక్కడ వరుస కట్టి ఉన్నారని చెప్పారు. ప్రజాస్వామ్యంలో చాలా మంది పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు.
ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ వేసేందుకు వెళ్లగా ఆయన ముందు 35 మంది వరకు కూర్చున్నారని, వారి వద్ద సరైన నామినేషన్ పత్రాలు కూడా లేవని, వారితోపాటు 10 మంది ప్రపోజర్స్ కూడా ఉన్నారని చెప్పారు. వారు కేజ్రీవాల్ను నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
కాగా, ఇటీవలే ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. న్యూఢిల్లీ నుంచి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తుండగా.. డిప్యూటీ సీఎం పత్పార్గంజ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఏపీ నేతలందరూ అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు. చాందినీ చౌక్ నుంచి పర్లాద్ సింగ్ సాహ్నీ, డ్వార్కా నుంచి వినయ్ కుమార్ మిశ్రా, గాంధీనగర్ నుంచి దీపూ చౌదరి పోటీ చేయనున్నారు. మనోజ్ కుమార్ స్థానంలో కోండ్లి నుంచి పార్టీ అధికార ప్రతినిధి కులదీప్ కుమార్కు ఆప్ టికెట్ ఇచ్చింది.
ఈ మేరకు ట్విట్టర్లో ఆమ్ ఆద్మీ పార్టీ.. త్వరల జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 70 మంది అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు పేర్కొంది. అందరూ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు వెల్లడించింది. అభ్యర్థులంతా వారి వారి నియోజకవర్గాల్లోని ప్రజల ఆశీర్వదంతో గెలుస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఎవరూ కూడా ఏమరపాటుగా ఉండొద్దని, గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాలని అన్నారు. ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీపై, మీ(అభ్యుల)పై నమ్మకముందని తెలిపారు. గాడ్ బ్లెస్ అంటూ ట్వీట్ ముగించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 8న జరగనున్నాయి. అదే నెల 11న ఫలితాలు వెలువడనున్నాయి. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 67 స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ మాత్రం మూడు సీట్లకే పరిమితమైంది.