కరోనా: ఢిల్లీ, ముంబైలో సీన్ గంభీరం.. ప్రభుత్వాల తాజా హెచ్చరిక..
కరోనా మహమ్మారి ధాటికి దేశరాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాలు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి. దేశంలోనే అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదుకాగా, కొత్తగా 20 హాట్ స్పాట్ ల ప్రకటనతో ఢిల్లీ ఉలిక్కిపడింది. ఈ రెండు సిటీల్లోని ప్రజలు.. ఎట్టిపరిస్థితుల్లోనూ మాస్క్ ధరించకుండా ఇళ్ల నుంచి బయటికి రావొద్దని స్థానిక ప్రభుత్వాలు ఆదేశించాయి. కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ లేనప్పటికీ.. వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడానికే ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాయి.
మొత్తం 1135 కేసులతో కొవిడ్-19 చార్ట్ లో మహారాష్ట్ర టాప్ ప్లేసులో ఉంది. అక్కడ ఇప్పటికే 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా ముంబై సిటీలో పరిస్థితి రోజురోజుకూ గంభీరంగా తయారవుతున్నది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావిలో బుధవారం కొత్తగా మూడు కేసులు వెలుగుచూడటంతోపాటు ఓ వ్యక్తి మరణించాడు. లాక్ డౌన్ కొనసాగుతున్నా సిటీలో వైరస్ వ్యాప్తి కొనసాగుతుండటంతో బృహన్ ముంబై కార్పొరేషన్ 'తప్పని సరి మాస్క్' ఆదేశాలు జారీచేసింది.
Recommended Video
మొత్తం 669 కేసులతో కొవిడ్-19 చార్టులో మూడో స్థానంలో ఉన్న ఢిల్లీలో బుధవారం నాటికి 20 హాట్ స్పాట్ లను గుర్తించారు. మాస్కులు ధరించడం వల్ల కరోనా వ్యాపించే ముప్పు తగ్గుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మాస్కులు లేకుంటే కనీసం కర్చీఫ్ అయినా వాడాలని ఆయన సూచించారు. ముంబై ఢిల్లీతోపాటు యూపీ, జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రభుత్వాలుకూడా ఇదే తరహా ఆదేశాలు జారీచేశాయి.