Mood of the Nation survey:మోడీ తర్వాత రాహులే ప్రధాని పదవీకి అర్హులు, తగ్గిన సోనియా ప్రభ
దేశంలో అత్యంత ప్రజాధారణ కలిగిన వ్యక్తుల్లో ఒకరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే 2024లో ప్రధాని పీఠం చేపట్టేది ఎవరు..? ఎవరికీ ప్రజలు పట్టం కట్టబోతున్నారనే అంశంపై ఇండియా టుడే గ్రూప్-కార్వీ ఇన్సైట్స్ 'మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే'చేపట్టింది. తిరిగి ప్రధాని పీఠం అధిష్టించేందుకు నరేంద్ర మోడీకి 'మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే' పట్టం కట్టింది. మోడీ ప్రధాని పీఠం చేపట్టేందుకు 53 శాతం మంది ప్రజలు ఓటేశారు. రాహుల్ గాంధీ 13 శాతంతో రెండోస్థానంలో నిలిచారు.
సెకండ్ ప్లేస్
మోడీ తర్వాత ప్రజలు రాహుల్ గాంధీకే ప్రజలు పట్టం కట్టారు. కానీ ప్రధాని మోడీ-రాహుల్ గాంధీ మధ్య పర్సంటేజీ తేడా 40 శాతం ఉండటం విశేషం. మోడీ తర్వాత మాత్రం ప్రధాని పదవీ చేపట్టేందుకు రాహుల్ గాంధీ అర్హుడని పేర్కొనడం విశఏషం. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ గ్రాఫ్ మరింత పడిపోయింది. ఆమెకు కేవలం 7 శాతం ప్రజలు మాత్రమే పట్టం కట్టారు. యూపీఏ చైర్ పర్సన్గా రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినా.. సోనియాగాంధీ ప్రభ తగ్గుతూ వస్తోంది.
అమిత్ షా @ 4 శాతం
బీజేపీ మాజీ చీఫ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కేవలం 4 శాతం ప్రజల నుంచి ఓట్లు వచ్చాయి. బీజేపీ అధినేతగా.. పార్టీని కేంద్రంలో రెండుసార్లు అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించినా.. ఓటర్లు మాత్రం అంతగా మొగ్గుచూపలేదు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా కేవలం మూడు శాతం ఓట్లతో సరిపెట్టుకున్నారు. అయితే మోడీ తర్వాత ప్రధాని పదవీ చేపట్టేందుకు ప్రియాంక గాంధీ మంచి ప్రత్యామ్నాయం అని పేర్కొన్నడం విశేషం.
వెస్ట్రన్ ఇండియాలో మోడీ హవా
సర్వేలో 60 శాతం హిందువులు, 17 శాతం మంది ముస్లింలు మోడీ మూడోసారి ప్రధాని పదవీ చేపట్టేందుకు అర్హుడని పేర్కొనడం విశేషం. సర్వేలో 10 శాతం మంది హిందువులు, 32 శాతం మంది ముస్లింలు రాహుల్ గాంధీ ప్రధాని పదవీ చేపట్టేందుకు అనుకూలంగా ఉన్నారు. పశ్చిమ భారతదేశంలో ప్రధాని మోడీకి మంచి క్రేజ్ ఉంది. 66 శాతం మంది ప్రజలు మోడీ తిరిగి ప్రధాని పదవీ చేపట్టాలని ఆకాంక్షించారు. ఇక్కడ రాహుల్ గాంధీకి కేవలం ఆరు శాతం మంది మాత్రమే అనుకూలంగా ఓటేశారు.
1, 2 శాతాలకే..
తదుపరి ప్రధాని ఎవరు ఉండాలనే అంశంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేత పీ చిదంబరం, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ పేర్లను కూడా సర్వేలో పొందుపరిచారు. అయితే వీరు తమ తదుపరి ప్రధాని అయ్యేందుకు కేవలం 1 నుంచి 2 శాతం ప్రజలు మాత్రమే సానుకూలంగా ఉన్నారు.
19 రాష్ట్రాల్లో..
ఇండియా టుడే్-కార్వీ ఇన్సైట్స్ నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ద నేషన్' సర్వే కోసం 19 రాష్ట్రాల్లో 97 లోక్సభ స్థానాలు, 194 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 12 వేల 141 మంది ప్రజలు ఆభిప్రాయం తెలుసుకున్నారు. ఇందులో 67 శాతం మంది గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు కాగా.. 33 శాతం పట్టణాలకు చెందినవారు. అయితే గ్రామీణ, పట్టణాల్లో స్త్రీ, పురుషులు సమానంగా తీసుకొని.. వారి అభిప్రాయాన్ని సేకరించారు.