సరిహద్దుల్లో ఆర్మీకి ఉగ్రవాదుల మధ్య కాల్పులు... అమరులైన ఇద్దరు జవాన్లు
జమ్మూ: కొత్త సంవత్సరం సరిహద్దుల్లో కాల్పులతో ప్రారంభమైంది. లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద భారత్లోకి చొరబడేందుకు కొందరు చొరబాటుదారులు ప్రయత్నిస్తుండగా అలర్ట్ అయిన భారత జవాన్లు కాల్పులు జరిపారు. ముష్కరులు తిరిగి కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటన జమ్మూ కశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో చోటుచేసుకుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్లోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తుండగా వారిని ఖారీ త్రయత్ అటవీప్రాంతంలో భారత జవాన్లు అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే నౌషేరా సెక్టార్లో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు.
ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో తచ్చాడుతున్నారన్న సమాచారం అందడంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆర్మీ అధికారి లెఫ్ట్నెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ చెప్పారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే కొత్త ఆర్మీ చీఫ్గా జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే బాధ్యతలు చేపట్టి పాకిస్తాన్కు గట్టి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రవాదం ఎట్టి పరిస్థితుల్లోను సహించబోమని ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు భారత్కు అన్ని అర్హతలు ఉన్నాయని ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే చెప్పారు.
ఇక ఆర్మీ చీఫ్గా బాధ్యతలు చేపట్టక కొన్ని గంటల ముందు భారత భద్రతా వ్యవస్థ, ఎదుర్కొంటున్న సవాళ్లు, ఉగ్రవాదం వంటివాటిపై జనరల్ మనోజ్ ముకుంద్ మాట్లాడారు. ఉగ్రవాదంను సహించేదేలేదని చెబుతూ పాకిస్తాన్ తీరు మారకపోతే భారత్ చేయాల్సింది చేస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. పాకిస్తాన్ ఉగ్రవాదంను ప్రోత్సహించడం మానేయాలని సూచించారు. తీరు మారకపోతే ఇదివరకు ఎలాగైతే సర్జికల్ స్ట్రైక్స్ చేశామో అలాంటివి భవిష్యత్తులో కూడా చేస్తామని ఆర్మీ చీఫ్ హెచ్చరించారు.