పరిస్థితి మారదా! మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ లో మోసుకెళ్లిన బీహారీలు
పాట్నా : మొన్నటి ఒడిశా ఘటన కళ్లముందు ఇంకా కదలాడుతూనే ఉండగా.. అలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా మరిన్ని చోటు చేసుకుంటుండడం శోచనీయం. అంబులెన్స్ లేని కారణంగా పోస్ట్ మార్టం నిర్వహించిన ఓ శవాన్ని కుటుంబ సభ్యులు ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో చుట్టి తీసుకెళ్లిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
సింటు కుమార్ అనే వ్యక్తి దాదాపు రెండు వారాల క్రితం ప్రమాదవశాత్తు గంగానదిలో పడి చనిపోయాడు. గత 25వ తేదీన అతడి మృతదేహాన్ని వెలికి తీయించారు పోలీస్ అధికారులు. అప్పటికే మృతదేహాం బాగా కుళ్లిపోయింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కతియార్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే శవాన్ని పోస్టుమార్టానికి స్వీకరించని అక్కడి వైద్యులు.. అక్కడికి 86కి.మీ దూరంలో ఉన్న భాగల్పూర్ ఆసుపత్రికి మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించారు.
అయితే మృతదేహాన్ని అంతదూరం తీసుకెళ్లడానికి తమ వద్ద అంత డబ్బు లేదని దయచేసి ఓ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని సింటుకుమార్ బంధువులు ఆసుపత్రి సిబ్బందిని వేడుకున్నారు. నిర్లక్ష్యంగా స్పందించిన సిబ్బంది.. అసలు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని శవాన్ని తరలించడం పోలీసుల బాధ్యత అని చెప్పి వారిని అక్కడి నుంచి పంపించేశారు. దీంతో దిక్కు తోచని స్థితిలో మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి మోసుకుంటూ వెళ్లారు సింటుకుమార్ బంధువులు.