కన్నీరు తెప్పిచ్చిన ఉల్లి ధరలు: ఇప్పుడు పెరిగిన పాల ధరల కూడా
న్యూఢిల్లీ: ఇప్పటికే పెరిగిన ఉల్లిపాయల ధరలు సామన్యుడికి కంటతడి పెట్టిస్తుంటే.. ఇప్పుడు నిత్యావసరమైన పాల ధరలు కూడా పెరిగిపోయాయి. దేశ వ్యాప్తంగా అన్ని పాల ఉత్పత్తుల సంస్థలు పాల ధరలను పెంచేశాయి. నిత్యావసరంగా ఉపయోగించే పాల ధరలు కూడా పెరగడంతో సామాన్యుడిపై మరో భారం పడినట్లయింది.
ఆమూల్, మదర్ డెయిరీ, తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'విజయ'కూడా పాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. సప్లై తక్కువగా ఉండి.. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పాల ధరలు పెరిగినట్లు తెలుస్తోంది.
పెరిగిన 'విజయ' పాల ధర సోమవారం నుండి అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య జనరల్ మేనేజర్ ప్రకటించారు. దీని ప్రకారం ఒక లీటర్ పాల ధర రెండు రూపాయలు పెరుగుతోంది. డైట్ మిల్క్ లీటర్ 36 రూపాయల నుండి 38 రూపాయలకు పెరిగింది.
డబుల్ టోన్డ్ మిల్క్ ధర 38 రూపాయల నుండి 40 రూపాయలకు, టోన్డ్ మిల్క్ లీటర్కు 42 రూపాయల నుండి 44 రూపాయలకు పెరిగింది. ఆవు పాలు లీటర్కు 42 రూపాయల నుండి 44 రూపాయలకు పెంచడం జరిగింది. ఓవైపు కూరగాయలు, ఉల్లి ధరలు పెరగడంతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యుడికి పాల ధరలు పెరగడం మరో కొత్త భారం మీదపడినట్లయింది.