పఠాన్కోట్: భారత్-పాక్ సరిహద్దుల్లో లేజర్ గోడలు
న్యూఢిల్లీ: పఠాన్కోట్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్తో సరిహద్దుల్లో నిఘావ్యవస్థపై భారత్ మరింత దృష్టి సారించింది. పాక్ నుంచి ముష్కరుల చొరబాట్లకు అడ్డుకట్ట వేయడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా పంజాబ్లో నదుల ప్రవాహం కారణంగా సరిహద్దుల్లో కంచె రక్షణలేని 40కి పైగా ప్రాంతాల్లో ‘లేజర్ గోడ(లేజర్ వాల్స్)'లను ఏర్పాటుచేయనున్నట్లు హోంమంత్రిత్వశాఖ అధికారి ఒకరు వెల్లడించారు.
ప్రస్తుతం కేవలం ఐదారు ప్రాంతాల్లోనే ఈ వ్యవస్థను వినియోగిస్తున్నారు. పఠాన్కోట్లో దాడికి తెగబడ్డ ఉగ్రవాదులు బమియాల్లోని ఉజ్ నది గుండా భారత్లోకి చొరబడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ ప్రాంతంలో ఇంతకుముందు లేజర్ నిఘా రక్షణ లేదు.
పఠాన్కోట్లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో గతవారం బీఎస్ఎఫ్ సదరు ప్రాంతంలో లేజర్ నిఘా సదుపాయం కల్పించింది. ‘లేజర్ గోడ' వ్యవస్థలో లేజర్ ఉత్పత్తి స్థానం(సోర్స్), శోధక పరికరం(డిటెక్టర్) ఉంటాయి.
నదీ ప్రవాహానికి ఇరువైపులా వీటిని ఏర్పాటుచేస్తారు. నదిలో పడవ ద్వారా రాత్రిళ్లు కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు బిఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. మత్తుపదార్థాల అక్రమ రవాణాను కూడా అడ్డుకునేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.