బెట్టర్ ఇండియా కోసమే..: 'అంతటికీ ఒకే ఒక్కరు కారణం.. అది మోడీయే, హత్య కేసు పెట్టాలి'
ఏటీఎం వద్ద, బ్యాంకుల వద్ద క్యూలు ఉన్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయని కానీ ఆ క్యూలు భవిష్యత్తు బెట్టర్ ఇండియా కోసమని బీజేపీ నేతలు అంటున్నారు.
న్యూఢిల్లీ: నల్ల ధనానికి మద్దతుగా కొందరు మాట్లాడుతున్నారని, అది దురదృష్టకరమని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం అన్నారు. ఢిల్లీలో జరిగిన 'కేదార్నాథ్ సాహ్ని స్మృతిగ్రంథ్' ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
నల్లధనానికి మద్దతుగా కొందరు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. వ్యవస్థలో భాగమైన అవినీతి, నల్లధనాన్ని మనం ఎందుకు అంగీకరించాలని ప్రశ్నించారు. రాజీ లేకుండా భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలని మోడీ హితవు పలికారు.
నోట్ల రద్దు: 'అంతా మీ వల్లే రాజీనామా చెయ్'
ఇదిలా ఉండగా, ప్రధాని నరేంద్ర మోడీ ఉదయం ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. భవిష్యత్తు, పేదల కోసమే నోట్ల రద్దు అని చెప్పారు. ఈ చర్య వల్ల ఉన్న లాభాలను ప్రజలకు చెప్పాలన్నారు. విపక్షాలు దీనిని రాజకీయం చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. కాగా, ఏటీఎం వద్ద, బ్యాంకుల వద్ద క్యూలు ఉన్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయని కానీ ఆ క్యూలు భవిష్యత్తు బెట్టర్ ఇండియా కోసమని బీజేపీ నేతలు అంటున్నారు.
నరేంద్ర మోడీపై హత్య కేసు పెట్టాలి: సంజయ్ నిరుపమ్
ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రకటించిన అనంతరం, ఈ ప్రభావంతో దేశవ్యాప్తంగా 70 మంది మృతి చెందారని ముంబై కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ నిరుపమ్ మంగళవారం ఆరోపించారు. ఇందుకు కాను ప్రధాని పైన హత్య కేసు పెట్టాలని ఆగ్రహం వ్యక్తం చేసారు.
తినడానికి ఏం లేక, అనారోగ్యం వస్తే మెడిసిన్స్ కొనలేక, ఇతర వస్తువులు కొనుక్కోలేక ప్రజలు కోట్లాది మంది ప్రజలు రోడ్డున పడ్డారన్నారు. వారి ఇబ్బందులు వర్ణనాతీతం అన్నారు. రోజుల తరబడి ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ కడుతున్నారన్నారు.
వారి వారి సొంత డబ్బులను డ్రా చేసుకునేందుకే ప్రజలు క్యూ కడుతూ ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే 70 మంది మృతి చెందారన్నారు. దీని కంతటికీ ఒకే ఒక్క వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ కారణం అన్నారు. అతని పైన హత్య కేసు పెట్టి, చర్యలు తీసుకోవాలన్నారు.