భారత పవర్ గ్రిడ్పై చైనా కుట్ర: సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలపై హ్యాకర్ల దాడి
న్యూఢిల్లీ: మన దేశ సరిహద్దులోనేగాక, దేశంలో లోపల కూడా కుట్రలకు తెరతీసింది డ్రాగన్ కంట్రీ. మనదేశ పవర్ గ్రిడ్, ఆ తర్వాత కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలపైనా చైనాకు చెందిన హాకర్లు కుతంత్రాలు చేసినట్లు వెలుగులోకి వచ్చింది.
భారత పవర్ గ్రిడ్పై చైనా కుట్ర.. ముంబై చీకటి అందుకేనా?
గల్వాన్ ఘటన తర్వాత నాలుగు నెలలకే అక్టోబర్ 12న ముంబైలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అనేక రైళ్లు ఆగిపోయాయి. శివారు ప్రాంతాల్లో అయితే 10 నుంచి 12 గంటలు కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఈ విద్యుత్ సంక్షోభానికి సరిహద్దు వివాదంతో సంబంధం ఉందని అమెరికాలోని రికార్డెడ్ ఫ్యూచర్ అనే సంస్థ తన అధ్యయనంలో తేల్చింది. సరిహద్దులో ఉద్రిక్తతల సమయంలో భారత పవర్ గ్రిడ్పై చైనా సైబర్ నేరగాళ్లు గురిపెట్టారని, సరిహద్దులో భారత్ వెనక్కి తగ్గకపోతే దేశమంతా అంధకారంలోకి వెళ్తుందని చైనా 'ముంబై పవర్ కట్' ద్వారా హెచ్చరించిందని ఆ సంస్థ వెల్లడించింది. చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న రెడ్ఎకో గ్రూప్ అనే సంస్థ మనదేశంలోని ఎన్టీపీసీ సహా ఐదు ప్రైమరీ లోడ్ డిస్ప్యాచ్ సెంటర్లు, విద్యుత్ సంస్థల కంప్యూటర్ నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థల్లోని 21 ఐపీ అడ్రస్ లపై హ్యాకర్లు దాడి చేసినట్లు పేర్కొంది. ఈ ఐపీ అడ్రస్ ల ద్వారా విద్యుత్ సరఫరాను నిర్వహించే కంట్రోల్ సిస్టంలోకి చైనా హ్యాకర్లు మాల్వేర్ను చొప్పించినట్లు వెల్లడించింది.
డ్రాగన్ హ్యాకర్ల ప్రభావం ఏమీ లేదు..
భారత ప్రభుత్వానికి చెందిన విద్యుత్ సంస్థల కంప్యూటర్ నెట్వర్క్స్లు, లోడ్ డిస్పాచ్ సెంటర్లు తదితర వాటిని చైనా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న హ్యాకింగ్ గ్రూపులు లక్ష్యంగా చేసుకున్నాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. గత అక్టోబర్ నెలలో దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారీ పవర్ కట్ వెనుక డ్రాగన్ హస్తం ఉందని, ఇది భారత్కు ఓ హెచ్చరిక అని పేర్కొంది. అయితే, హ్యాకర్ల ప్రభావం పవర్ గ్రిడ్లపై పనిచేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పస్టం చేసింది.
భారత కరోనా వ్యాక్సిన్ తయారీ సంస్థలపై డ్రాగన్ హ్యాకర్ల కన్ను
ఇది ఇలావుంటే, తాజాగా, మనదేశంలో కరోనా వ్యాక్సిన్లు తయారు చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలపైనా చైనా హ్యాకర్లు హ్యాకింగ్కు ప్రయత్నించినట్లు సైబర్ ఇంటెలీజెన్స్ సంస్థ సైఫిర్మా తెలిపింది. ప్రపంచంపైకి చైనా కరోనావైరస్ను పంపిస్తే.. భారత్ మాత్రం దానికి విరుగుడైన కరోనా వ్యాక్సిన్లను ప్రపంచ దేశాలకు అందిస్తోంది. ప్రపంచంలో విక్రయించే వ్యాక్సిన్లలో దాదాపు 60శాతానికిపైగా వ్యాక్సిన్లు మనదేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనై చైనా కుట్రలు, కుతంత్రాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. స్టోన్ పాండా అనే చైనా హ్యాకింగ్ గ్రూప్ ఎపిటి 10.. భారత్ బయోటెక్, సీరమ్ ఇనిస్టిట్యూ ఆఫ్ ఇండియా(సీఐఐ)లకు సంబంధించిన ఐటీ మౌలిక సదుపాయాలు, సప్లై చైన్ సాఫ్ట్వేర్లలోని మూలాలను మాల్వేర్ని చొప్పించడం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసిందని సింగపూర్, టోక్యో కేంద్రంగా పనిచేస్తున్న గోల్డ్మాన్ సాచ్స్ మద్దతున్న సైఫిర్మా అనే సైబర్ ఇంటెలీజెన్స్ సంస్థ పేర్కొంది. ఈ సంస్థల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు చైనా హ్యాకర్లు ఇలా సైబర్ దాడులకు తెగబడుతున్నారని సైఫిర్మా చీఫ్ ఎగ్జిక్యూటివ్ రితేష్ తెలిపారు.