బీజేపీకి ఓటేయాలని యువరాజ్-సాక్షి 'పెళ్లి కార్డ్': మోడీ ఏమన్నారంటే?
సూరత్: ఇటీవల పెళ్లి చేసుకుంటున్న రెండు మూడు జంటలు ప్రధాని నరేంద్ర మోడీకి ఓటు వేయాలని తమ వెడ్డింగ్ కార్డులలో ప్రింట్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా సూరత్కు చెందిన ఓ జంట రాఫెల్ స్కాం గురించి వద్దని, ప్రధాని మోడీకి ఓటు వేయాలని అందులో పేర్కొన్నారు. మేం ఎలాంటి బహుమతులు కోరుకోవడం లేదని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని పేర్కొన్నారు.
ఈ మెయిల్ లేఖ
ఈ జంట పెళ్లి ఈ రోజే (జనవరి 22వతేదీ). వీరి పెళ్లి కార్డులో బీజేపీకి ఓటు వేయాలని చేసిన సూచనను ప్రధాని నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు. ఈ మేరకు వారికి ప్రధాని నుంచి లేఖ వచ్చింది. తన తల్లి పేరు పైన ఈ నెల 17వ తేదీన ప్రధాని నుంచి తమకు ఈ మెయిల్ లేఖ వచ్చిందని పెళ్లి కూతురు చెప్పారు.
నాకు స్ఫూర్తి కలిగింది
సూరత్కు చెందిన యువరాజ్, సాక్షి అగర్వాల్లు రాపెల్ వద్దు.. ప్రధాని మోడీని నమ్మమని చెబుతూ వారు వెడ్డింగ్ కార్డును వినూత్నంగా తయారు చేయించారు. ఈ లేఖ నరేంద్ర మోడీకి నచ్చింది. దీంతో 'యువరాజ్, సాక్షిల వివాహమహోత్సవం సందర్భంగా మీ కుటుంబానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అతిథులకు అందజేసిన పెళ్లి శుభలేఖలో ఉన్న ప్రత్యేకతను నేను గమనించాను. అందులో ఉన్న సమాచారం దేశంపై మీకున్న అభిమానాన్ని ప్రతిబింబిస్తోంది. దేశం కోసం ఇంకా కష్టపడి పనిచేయాలని అది నాకు స్ఫూర్తి కలిగించింది' అని మోడీ సంతకం చేసిన లేఖను జనవరి 17వ తేదీన ఈమెయిల్ చేశారు.
యువరాజ్, సాక్షి సంతోషం
మోడీ లేఖ పంపించడంతో చాలా సంతోషంగా ఉన్నామని యువరాజ్, సాక్షిలు తెలిపారు. వివాహ ఆహ్వాన పత్రికలో.. రఫేల్ ఒప్పందం విషయంలో మోడీని నమ్మండి అంటూ దానికి సంబంధించిన కొంత సమాచారాన్ని కార్డుపై ప్రచురించారు. అంతేకాకుండా నమో యాప్ ద్వారా బీజేపీకి నిధులు ఇవ్వాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయడమే మీరు మాకు ఇచ్చే బహుమతులు అని ప్రచురించారు.