రాహుల్కు శివసేన మద్దతు: మోడీతో ఆలింగనంపై బీజేపీ ట్వీట్, కన్నుగీటడంపై రమ్యకు ప్రశ్న
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ ప్రసంగాన్ని శివసేన నేత ఆనంద్ రావు స్వాగతించారు. అవిశ్వాస తీర్మానం చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. ప్రసంగం ముగిసిన తర్వాత రాహుల్.. ప్రధాని మోడీ వద్దకు వెళ్లి కరచాలనం చేసి, ఆలింగనం చేసుకున్నారు. అక్కడి నుంచి వెళ్తున్న రాహుల్ను.. మోడీ మళ్లీ వెనక్కి పిలిపించి.. బాగా మాట్లాడారని భుజం తట్టారు.
Recommended Video
ఇదిలా ఉండగా, కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలపై ఆనందరావు స్పందించారు. రాహుల్ ఈ రోజు లేవనెత్తిన అంశాలకు కొంత అర్థం ఉందన్నారు. ఈ ఆరోపణలతో ప్రధాని మోడీ, బీజేపీ ఇమేజ్కు కొంత దెబ్బే అన్నారు.
కాంగ్రెస్ ఆలింగనం ట్వీట్
అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. రాహుల్ ప్రసంగిస్తున్నప్పుడు మోడీ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. మరోవైపు రాహుల్ తన ప్రసంగం ముగింపు తర్వాత రాహుల్ చేసిన పనికి సభలోనే వారు కాదు, ప్రత్యక్ష ప్రసారం చూస్తున్న వారు కూడా అవాక్కయ్యారు. ప్రధాని కూర్చున్న చోటుకు వెళ్లిన రాహుల్.. ఆయనతో కరచాలనం చేసి, ఆలింగనం చేసుకున్నారు. మోడీకి కూడా కాసేపు అర్థం కానట్లుగా ఉంది. ఆ తర్వాత రాహుల్ను పిలిచి భుజం తట్టారు మోడీ. ఆ తర్వాత తన స్థానంలోకి వెళ్లి కూర్చొన్న రాహుల్.. తోటి సభ్యులు ఏదో అడగటంతో కన్ను గీటుతూ కనిపించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. మోడీని రాహుల్ ఆలింగనం చేసుకున్న ఫోటోలను కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
బీజేపీ ట్వీట్
ప్రధాని మోడీని రాహుల్ గాంధీ హత్తుకోవడంపై బీజేపీ కూడా తన ట్విట్టర్ అకౌంటులో ట్వీట్ చేసింది. రాహుల్ ప్రసంగానికి నవ్వుతున్న మోడీ వీడియోను పెట్టి.. మీ ఎంటర్టైన్మెంట్కు థ్యాంక్స్కు మించి చెప్పలేకపోతున్నామని బీజేపీ పేర్కొంది.
శోభకందర్లాజే ట్వీట్
ఈ ఆలింగనంపై, రాహుల్ ప్రసంగంపై కర్ణాటక బీజేపీ నేత శోభకందర్లాజే స్పందిస్తూ.. రాహుల్ తన ఆరోపణలతో పార్లమెంటు సమయాన్ని వృథా చేస్తున్నారని, రాజకీయంగా ఎదగడానికి మరెన్నో మైల్స్ అవసరమని పేర్కొన్నారు.
మంజీందర్
ఢిల్లీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే మంజీందర్ ఎస్ సిర్సా ట్వీట్ చేస్తూ... ఇలా కన్ను గీటడం కూడా మీ ట్రెయినింగ్ సెషన్లో ఓ భాగమేనా దివ్య స్పందన గారు అని ఎద్దేవా చేశారు. దివ్య స్పందన అలియాస్ రమ్య కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం ఇంచార్జ్.
ఇండియన్స్ కామెడీ అడిక్ట్
అదే బీజేపీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సా మరో ట్వీట్ పోస్ట్ చేశారు. అందులో మోడీ నవ్వుతున్న ఫోటో పెట్టారు. మన ఇండియన్స్ కామెడీ అడిక్ట్ అని పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ స్పీచ్ బేస్లెస్ స్పీచ్ అని ఆరోపించారు.